రూ.1000 తగ్గింపు: పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించిన ఎయిర్లైన్స్ సంస్థలు
న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థలు వరుసకట్టి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా గోఎయిర్ కూడా వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. గోఎయిర్ టికెట్ కనీస ధర రూ. 1045గా ప్రకటించింది. జులై 20-జులై23 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకునే ప్రయాణాలు కూడా జులై 21-ఆగస్టు 10మధ్యలోనే ఉండాలి. ఈ సేల్ కింద పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని గోఎయిర్ ప్రకటించింది.
ఒక వేళ ఈసేల్ కింద ఎంపిక చేసిన సీట్లు అమ్ముడుపోతే ఆ తర్వాత బుక్ చేసుకునే వాటికి సాధారణ ధరలు వర్తిస్తాయని తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల మొత్తం పేటీఎంతో బుక్ చేసుకునే ప్రయాణాలపై క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా వర్తిస్తుందని తెలిపింది.
ఇతర ఎయిర్లైన్స్ కూడా భారీ ఆఫర్ల ప్రకటన
గోఎయిర్ తోపాటు ఎయిర్ఏషియా, జెట్ఎయిర్వేస్, స్పైస్జెట్ సంస్థలు కూడా భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఎయిర్ఏషియా రూ.1339కి ఢిల్లీ, బెంగళూరు, రాంచీ, జైపూర్, కొచ్చి, పుణెలకు టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ జులై 29వరకు అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 31లోపు ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
జెట్ ఎయిర్వేస్ 30శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల బేస్ ధరపై వర్తిస్తుంది. ఈ ఆఫర్ సోమవారం అర్ధరాత్రితో ముగియనుంది.
కాగా, స్పైస్జెట్ కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈరోజు(సోమవారం) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్లను ఉపయోగించి బుక్ చేసుకుంటే టికెట్పై రూ.1000 తగ్గింపు అందిస్తోంది. ప్రోమోకోడో: HDFC1000 ఉయోగించి ఈరోజు ఈ ఆఫర్ను పొందవచ్చు.