నేడు తమిళనాడు, ఏపీలో మోదీ పర్యటన .. ఎప్పటిలాగానే నిరసనలు కొనసాగుతాయా ?
న్యూఢిల్లీ : సంక్షేమ పథకాలు, దేశం కోసం మోదీ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత ధీటుగా స్పందించి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో యావత్ భారత ప్రజలు, పార్టీలు, నేతలు అండగా నిలిచారు. ప్రపంచ దేశాలు కూడా బాసటగా నిలిచాయి. ఇంతరకు ఓకే కానీ .. మోదీకి దక్షిణాదిలో పర్యటించే సమయంలో ఏదో ఒక నిరసన ఎదురవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో నేడు తమిళనాడు, ఏపీలో పర్యటిస్తుండటంతో Goback Modi is back in trend అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
తమిళనాడు టు ఏపీ
షెడ్యూల్ ప్రకారం ఇవాళ మోదీ మూడురాష్ట్రాల్లో పర్యటిస్తారు. తొలుత తమిళనాడు వెళ్తారు. అక్కడ వివిధ ప్రాజెక్టు పనులను శంకుస్థానన చేస్తారు. అయితే మోదీ వెళ్లిన ప్రతీసారి గో బ్యాగ్ మోదీ అని సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందుకు అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలిత మృతిచెందాక జరిగిన పరిణామాలతో తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. ముఖ్యంగా డీఎంకే, లేదంటే అన్నాడీఎంకేకు ప్రజలు పట్టం కడతారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి అంతగా ఓటుబ్యాంకు లేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో పన్నీరుసెల్వం, పళనిస్వామిని తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నారని అక్కడి ప్రజలు చాలా సందర్భాల్లో నిరసనలు తెలిపారు. శుక్రవారం కూడా నిరసనహోరు వినిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రాజెక్టులకు శంకుస్థాపన
తమిళనాడులోని కన్యాకుమారిని అనుకొని ఐదు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.3 వేల కోట్లు. అలాగే అక్కడ ఒక ఉద్యానవనం, మ్యూజియం నిర్మాణ పనులకు అంకురార్పణ చేస్తారు. అదేవిధంగా మధురై-రామంతపూర్ మధ్య ఉన్న రెండు, 4 లైన్ల రహదారిని జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు మధురై చెట్టికులం, నాథామం మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో అక్కడే ఉండే స్థానికులకు పొల్యూషన్ బాధ తప్పుతోంది. అలాగే ప్రయాణికుల సమయం, ఇందన ఖర్చు తగ్గి .. సురక్షితంగా గమ్యస్థానానికి వెళతారని అధికారులు పేర్కొంటున్నారు.
విశాఖలో ప్రజా చైతన్య సభ
తమిళనాడు పర్యటన ముగించుకొని విశాఖపట్టణం వస్తారు మోదీ. ఇక్కడ జరిగే ప్రజా చైతన్య సభలో పాల్గొంటారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నందున ఈ సభ కోసం భారీ బందో బస్త్ ఏర్పాటు చేశారు. ఈ నెల 10న గుంటూరులో ప్రజా చైతన్య సభ జరిగింది. కానీ ఆ సమయంలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ప్రస్తావించలేదు. కానీ ఇటీవల విశాఖకు రైల్వేజోన్ ఇస్తామని ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ ను తొలగించడంపై ప్రజలు తప్పుపడుతున్నారు. రైల్వే ఉద్యోగులు, పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ధర్మపోరాట నిరసనలు
రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని అధికార టీడీపీ ఆరోపిస్తోంది. మోదీ పర్యటనను అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలో ధర్మ పోరాట నిరసనలు చేయాలని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సూచించడంతో .. ఆందోళనకు శ్రేణులు కార్యోన్యుఖులయ్యారు.