యాత్రికులను కాపాడేందుకు ‘అల్లా’ బలమిచ్చాడు: షేక్ సలీం మీర్జా
ఉగ్రవాదులు తుపాకులతో కాల్చే తూటాలకు మతం లేనట్లే తనకు మతం లేదని డ్రైవర్ సలీం మీర్జా అభిప్రాయ పడ్డాడు. అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి సురక్షితంగా 50 మంది యాత్రికులను కాపాడిన స
అహ్మదాబాద్: అది అత్యంత క్లిష్ట సమయం. అమర్నాథ్ను దర్శించుకుని తిరుగుప్రయాణమైన భక్తులపైకి ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. పేలుతున్న తూటాలు.. నేలకొరుగుతున్న ప్రయాణికులు.. ఆర్తనాదాలు.. ఆ పరిస్థితిలోనూ డ్రైవర్ షేక్సలీం మీర్జా బస్సును ముందుకు నడిపించి 50మంది ప్రాణాలు కాపాడారు.
ఉగ్రవాదులు తుపాకులతో కాల్చే తూటాలకు మతం లేనట్లే తనకు మతం లేదని డ్రైవర్ సలీం మీర్జా అభిప్రాయ పడ్డాడు. రెండు రోజుల క్రితం కశ్మీర్ రాష్ట్రంలో అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి సురక్షితంగా 50 మంది యాత్రికులను కాపాడిన సలీం మీర్జా ధైర్య సాహసాలు అనన్య సామాన్యం. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ 50 మంది ప్రయాణికులను కాపాడిన ధైర్యశాలిగా ఆయనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
మిగతా ఏడుగురిని కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా తాను శివ భక్తుడినని, కుటుంబ సభ్యుల కోసం అమర్ నాథ్ యాత్రలో ప్రసాదం కూడా తీసుకొచ్చానని తెలిపారు. ఉగ్రవాదులు తాము ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నప్పుడు 'అల్లా, శివుడి ఆదేశాల మేరకే.. బలం మేరకే బస్సును ముందుకు నడిపి ఉంటా' అని పేర్కొన్నారు.
దిగ్బ్రాంతికి గురయ్యా...
ఉగ్రవాదుల దాడితో నెలకొన్న ఉద్విగ్న పరిస్థితుల్లో తానూ దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. బాధ కూడా వేస్తున్నదన్నారు. నాయకులందరూ ఉగ్రదాడి గురించే మాట్లాడుతున్నారని తెలిపారు. ‘నన్ను ప్రశంసిస్తున్నారు. సాహసివి అంటున్నారు. నాకు రాజకీయాలు అర్థం కావు. నా బాధ వేరే. బస్సులోని మొత్తం అందరు ప్రయాణికుల ప్రాణాలు కాపాడలేకపోయానే అని కుమిలిపోతున్నాను. 50 మంది ప్రాణాలు కాపాడాను. బస్సును సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ల గలిగాను. స్వల్ప గాయాలతో బయటపడ్డవారు నా వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. చాలామంది చేతులెత్తి దండం పెట్టారు.. కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. రక్తం.. చావులు.. నన్ను కలిచి వేశాయి. ఉగ్రదాడి జరిగిన 90 నిమిషాలకు కానీ నేను తేరుకోలేదు' అని సలీం మీర్జా తెలిపాడు.
Recommended Video
గుజరాత్ సీఎం ‘సాహస అవార్డు'కు సిఫారసు చేస్తామన్నారు
తనను గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విమానాశ్రయంలో పలుకరించి, సాహస అవార్డుకు సిఫారసు చేస్తామని చెప్పారని సలీం తెలిపారు. ‘నిజాయితీగా చెప్పాలంటే క్లీనర్ సీటులో కూర్చున్న బస్సు ఓనర్ హర్ష్భాయ్ నన్ను ముందుకు నడిపించారు. కాల్పులు జరిగినప్పుడు నాకు అర్థం కాలేదు. ఏదో రాయి కిటికీకి తగిలిందని అనుకున్నాను. కానీ తూటాలు దూసుకొస్తున్నాయని తెలుసుకునేసరికి భయం వేసింది. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మతం గురించి ఆలోచిస్తావా? నీ ప్రాణాలు కాపాడుకోవడం గురించి, ఇతరులను రక్షించడం గురించి మాత్రమే ఆలోచిస్తావు. బస్సులో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. తూటాలు.. రక్తం.. చూసేసరికి తలతిరిగింది. హర్ష్భాయ్ తమాయించుకుని నాకు ధైర్యం చెప్పారు. బస్సును ఆపొద్దని, వేగంగా ముందుకు పో' అని చెప్పారు. కొన్ని తూటాలు వచ్చిపడ్డ తర్వాత తాను సీటులోనుంచి దిగి కింద కూర్చున్నానని చెప్పాడు.
బస్సెక్కడకు వెళ్తుందో తెలియకున్నా స్టీరింగ్ వదల్లేదు
బస్సు ఎక్కడికి పోతున్నదో తెలియదు గానీ స్టీరింగ్ మీద నుంచి తన చేయిని తీయలేదని సలీం మీర్జా వ్యాఖ్యానించారు. ఈ లోగా హర్ష్భాయ్ తూటాలు తగిలి కింద పడ్డారు. స్టీరింగ్ ముందు కిందకు వంగి ఉండకపోతే ఆ తూటాలు తనకే తగిలేవని తెలిపాడు. సైనికులు ఉన్న ప్రదేశం వరకు వెళ్లిన తర్వాత బస్సును ఆపిన తర్వాత వారు అందరినీ దింపి వైద్యం అందించారన్నారు. ‘నేను భారతీయుడిని. అందుకు గర్విస్తున్నాను. చాలామందిలాగే నాకూ రాజకీయాలు తెలియవు. నాబోటి వాళ్లు ప్రశాంతంగా జీతం సంపాదించేందుకు వీలుగా దేశంలో శాంతి నెలకొనాలని మాత్రం కోరుకుంటాను. మా వల్సాడ్(గుజరాత్)లో మేం ఎవరి మీదా వివక్ష చూపం.
ఇప్పటికి నాలుగుసార్లు...
ఇప్పటివరకు నాలుగుసార్లు అమరనాథ్ యాత్ర చేశాను. ఎన్నో ఏండ్లుగా నేను ప్రగాఢమైన శివభక్తుడిని.. నా మాలిక్ నన్ను కాపాడాడు. బహుశా అల్లా, శివుడు నన్ను నడిపించారు. నాకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో తెలియదు. నేనూ అమరనాథ్ నుంచి నా కుటుంబ సభ్యుల కొరకు ప్రసాదం తెచ్చాను. నేను పెద్దగా చదువుకోలేదు. రాజకీయ వేత్తల్లా, పెద్దమనుషుల్లా, మీడియాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడడం నాకు రాదు' అని వ్యాఖ్యానించారు.