నాకు ఓటెయ్యక పోతే మట్టికొట్టుకు పోతారు..! యూపిలో బీజేపి ఎంపీ విచిత్రమైన బెదిరింపు..!!
లఖ్నవూ/హైదరాబాద్ : ప్రజలను ఓట్లు అడిగే విధానంలో నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓట్లను ప్రజలనుండి అర్థిస్తే మరికొందరు రెక్వస్ట్ చేసుకుంటారు. ఇంకొదరూ బ్రతిమిలాడు కుంటారు. కానీ యూపీలో ఓ ఎంపీ ప్రజలకు శాపనార్థాలు పెడుతూ, బెదిరిస్తూ ఓట్లను అడుక్కోవడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది.
నాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని పట్టించుకోను. మీకు ఉద్యోగాలు రావు అంటూ భాజపా ఎంపీ, కేంద్రమంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ సంఘటన పూర్తిగా మర్చిపోక ముందే తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీ కూడా ఓటర్లను హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తనకు ఓటు వేయకపోతే శపిస్తానంటూ ఉన్నావో ఎంపీ సాక్షి మహరాజ్ ప్రజలను హెచ్చరించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నావో నియోజకవర్గంలోని శేష్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
నేను డబ్బు, భూమి అడగట్లేదు. ఓట్లు అభ్యర్థిస్తున్నాను. నేనొక సన్యాసిని. ఒక సన్యాసి మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి భిక్ష అడిగినప్పుడు మీరు పట్టించుకోకపోతే ఆయన శపించి మీ సంతోషాలను తీసుకెళ్తాడు.
ఫలితంగా పాపాలను మీపై పడేస్తాడు. నేను ఊరికే అనట్లేదు. పురాణాల్లో ఉన్నదే చెబుతున్నాను, అంటూ హెచ్చరికలు చేశారు. సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నావో లోక్సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది.