పీవీకి సన్నిహితుడిగా భావించే తాంత్రికుడు చంద్రస్వామి కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి (66) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో మరణించారు.
చెన్నై: ఆధ్యాత్మిక గురువు, వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి (66) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో మరణించారు.
చంద్రస్వామి గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారనిసమాచారం. ఇటీవలే ఆయనకు గుండెపోటు రావడంతో పాటు ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించింది.
మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుతో సాన్నిహిత్యం ఉందంటూ జాతీయస్థాయిలో ప్రచారం జరగడంతో ఆయన ఫేమస్ అయ్యారు. ఆయన అసలు పేరు నేమీచంద్. జ్యోతిష్యంలో నైపుణ్యం ఉండటంతో పాటు తన ఆహార్యంతో కూడా ఆకట్టుకునేవారు.
మరోవైపు, చంద్రస్వామి పలు ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాటు ఈడి నమోదు చేసిన ఫెమా ఉల్లంఘన కేసులో జరిమానా చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆయనను ఆదేశించింది.
బ్రూనై సుల్తాన్, బహ్రేన్కు చెందిన షేక్ ఇసా బిన్ సల్మాన్ ఆల్ ఖలీఫా, నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్, ఆయుధాల దళారి ఉద్నాన్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం... వీళ్లంతా చంద్రస్వామి శిష్యులేనని ప్రచారం ఉంది.
కొంతమంది ఆయనను దేవుడి ప్రతిరూపంగా భావిస్తుంటారు. రాజస్థాన్లోని బెహ్రోర్కు చెందిన ఆయన తండ్రి, హైదరాబాదుకు వచ్చి వడ్డీ వ్యాపారం ప్రారంభించారు.
చంద్రస్వామి చిన్న పిల్లవాడిగా ఉండగానే వాళ్లు వలస వచ్చారు. చిన్నతనంలో ఇల్లు వదిలి బయటకు వచ్చిన చంద్రస్వామి.. గోపినాథ్ కవిరాజ్ వద్ద తాంత్రిక విద్యలు నేర్చారు. తర్వాత బీహార్ అడవుల్లో తపస్సు చేశారని చెబుతారు., కాగా, రాజీవ్ గాంధీ హత్య కేసులోను ఇతని పేరు వినిపించింది.