బీజేపి మెడకు చుట్టుకుంటున్న గాడ్సే వివాదం..! గాంధీ పాక్ జాతిపిత అన్న అనిల్ సౌమిత్ర పై వేటు..!!
దిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో స్వాతంత్ర పోరాట నాయకులపై తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాన్ని రాజేస్తున్నాయి. తాజాగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అనిల్ సౌమిత్రపై ఆ పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. పాకిస్థాన్ జాతిపిత మహాత్మాగాంధీ అంటూ ఫేస్ బుక్ లో ఆయన కామెంట్ చేశారు. గాంధీలాంటి వాళ్లు కోట్ల మంది జన్మించారని... వారిలో కొందరు మంచివారు కాగా, మిగిలినవారంతా ఉపయోగం లేనివారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, పార్టీలో అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బీజేపీ మీడియా రిలేషన్స్ విభాగానికి చీఫ్ గా సౌమిత్ర వ్యవహరిస్తున్నారు.
వారి వ్యాఖ్యలు బీజేపీ భావజాలానికి వ్యతిరేకం..! పార్టీ లైన్ అతిక్రమిస్తే శిక్ష తప్పదన్న అమిత్ షా..!!
గాడ్సే వివాదంపై అమిత్ షా శుక్రవారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. అనంత్ కుమార్, ప్రజ్ఞాసింగ్, నళిన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ భావజాలానికి వ్యతిరేకం. ఈ విషయాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. గాడ్సేపై అటువంటి వ్యాఖ్యలు చేసిన వీరి ముగ్గురి నుంచి బీజేపీ క్రమశిక్షణ కమిటీ సమాధానం అడుగుతోంది. పది రోజుల్లో ఆ కమిటీ వారి స్పందనను తీసుకుని, నివేదికను అందిస్తుంది.
నేతలు సంయమనం కోల్పోరాదు..! క్రమశిక్షణ కమిటీకి సిఫార్స్..!!
ఈ వ్యాఖ్యలు ఆ ముగ్గురు నేతల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇప్పటికే వారు చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమ శిక్షణ కమిటీకి పంపాం అని తెలిపారు. గాడ్సే ఒకరిని మాత్రమే చంపారని, కానీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మాత్రం 17,000 మందిని చంపారని, వీరిలో అత్యంత క్రూరులు ఎవరని నళిన్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏడు దశాబ్దాల తర్వాత ఇటువంటి చర్చ జరుగుతోంది. చివరకు గాడ్సే ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తారు అని అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించారు.
తుది ఘట్టానికి ఎన్నికలు..! అత్యదిక సీట్లు గెలుస్తామన్న మోది..!!
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300స్థానాలకు పైగా గెలుస్తుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ఖర్గోన్లో శుక్రవారం తుది ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశప్రజలంతా తనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. దశాబ్దాల అనంతరం వరుసగా రెండోసారి విస్పష్ట మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయభోతున్నామని తెలిపారు.
300కు పైగా సీట్లు మావే..! ధీమా వ్యక్తం చేసిన ప్రధాని..!!
ప్రజలు తమకు 300కు పైగా స్థానాలను కట్టబెట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. మీరు ఆదివారం ఓటు వేసేందుకు వెళుతూ చరిత్ర సృష్టించనున్నారని, దేశంలో వరుసగా రెండోసారి మెజారిటీ ప్రభుత్వం కొలువుతీరనుందని జోస్యం చెప్పారు. కాగా మే 19వ తేదీన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏడవ, తుది విడత పోలింగ్ జరగనుంది. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.