సభలో క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ, మరో రగడ..!
న్యూఢిల్లీ: మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ శుక్రవారం పార్లమెంటులో క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని, ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలన్నారు.
సభలో విపక్షాలు అప్రధానమైన అంశాలను సమస్యలుగా మారుస్తున్నాయని ఆయన విమర్శించారు. మహాత్మా గాంధీని నాథురాం గాడ్సే చంపినప్పటికీ.. తాను మాత్రం 1984లో సిక్కులను చంపినప్పుడే గాంధీజీ నిజంగా చనిపోయినట్లుగా తాను భావిస్తున్నానని మరో వివాదం రేపారు.
సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై గురు, శుక్రవారాలు పార్లమెంటు దద్దరిల్లింది. సాక్షి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎంపీ సాక్షి మహారాజ్ వెనక్కి తగ్గారు.
కాగా, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ మహారాష్ట్రలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పైన ఆయన ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
మహాత్ముడిని హత్య చేసిన నాథూరాం గాడ్సే జాతీయవాది అని, దేశభక్తుడని, ఆ తర్వాత మారిపోయాడని వ్యాఖ్యానించారు. అనంతరం వెంటనే తాను చేసిన వ్యాఖ్యలను సరిదిద్దికున్నారు.
తానేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఆ మాటలు వెనక్కు తీసుకుంటానని చెప్పారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడు అంటే తాను అంగీకరించనని చెప్పారు. సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు గురువారం నాడు పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చాయి.
మహారాష్ట్రలో భజరంగ దళ్, ఆరెస్సెస్లు సౌర్య దివస్ పేరిట ప్రతియేటా గాడ్సే సంస్మరణ సభలు జరుపుతున్నా కేంద్రం అడ్డుకోవడం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దీని పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. అటువంటి వ్యక్తులను గౌరవించే సమస్యే లేదని, ప్రభుత్వం తరపున సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించమని ఆయన చెప్పారు.