గాడ్సే నుంచి నిర్భయ దోషుల వరకు : ఆ జైల్లో తయారుచేసిన ఉరితాడుతోనే శిక్ష అమలు.. ఎందుకో తెలుసా?
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష విధించాలని పటియాలా కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు దోషులకు శిక్ష పడుతుండటంపై నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులు కూడా దోషుల ఉరికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎప్పటి లాగే ఈసారి ఉరిశిక్షకు కూడా బక్సర్ సెంట్రల్ జైల్లో తయారుచేసిన ఉరితాడునే వాడనున్నారు. బక్సర్ సెంట్రల్ జైల్లో తయారుచేసిన ఉరితాడును మాత్రమే వాడటానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.
నిర్భయ దోషులను ఉరితీయడం గొప్ప రిలీఫ్.. : తలారి పవన్ జల్లాద్
ఎందుకు అదే వాడుతున్నారు. :
బ్రిటీష్ హయాంలో 1880లో బీహార్లో బక్సర్ సెంట్రల్ జైలు ఏర్పాటైంది. ఈ జైలు ఏర్పాటైన నాలుగేళ్ల తర్వాత 1884లో ఉరితాళ్లను తయారుచేసే మెషీన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. అంతకుముందు ఉరితాళ్లకు పాపులర్ అయిన 'మనీలా రోప్'ను ఉపయోగించేవారు. దీన్ని ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి దిగుమతి చేసుకునేవారు.
అప్పటినుంచి ఇప్పటివరకు :
ఆ తర్వాతి కాలంలో ఇండియా ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం బక్సర్ జైలుకు మాత్రమే ఉరితాళ్లను తయారుచేసేందుకు అనుమతినిచ్చారు. ఈ చట్టం ప్రకారం దేశంలో మరెక్కడా ఉరితాళ్లను తయారుచేయరాదు. అలా బక్సర్ జైల్లో తయారుచేసిన ఉరితాళ్లతోనే మహాత్మాగాంధీ హంతకుడు నాథురాం గాడ్సే,పార్లమెంట్పై దాడి చేసిన అఫ్జల్ గురు,1993 బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమొన్,ముంబై 26/11 పేలుళ్ల నిందితుడు అజ్మల్ కసబ్ను ఉరితీశారు.
ఇలా తయారుచేస్తారు.. :
సాధారణ తాళ్లతో పోలిస్తే ఉరితాడు భిన్నంగా ఉంటుంది. మృధువుగా ఉండటంతో పాటు చాలా ధృఢంగా ఉంటుంది. ఈ తాడు తయారీకి J-34 అనే ప్రత్యేక నూలును వాడుతారు. దాదాపు 154 నూలు పోగులను ఉపయోగించడం ద్వారా ఒక ఉరితాడును తయారుచేస్తారు.తాడు మెత్తగా ఉండేందుకు ప్రతీ దశలో ఎక్కువ మొత్తంలో నీటిని ఉపయోగిస్తారు. ఇంత మృధువుగా ఉరితాడును తయారుచేయడానికి గల కారణం.. ఉరితీయబడ్డ వ్యక్తి మెడకు ఎలాంటి గాయాలు కావద్దన్న నిబంధన ఉండటం వల్లే. ఉరితీత తర్వాత పోస్టుమార్టమ్లో అతని మెడపై ఎలాంటి గాయాలు కాలేదని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
పంజాబ్ నుంచి సరఫరా
ఉరితాడుకు సంబంధించిన పత్తిని పంజాబ్లో సాగుచేస్తారు. అక్కడి నుంచే బక్సర్ జైలుకు కాటన్ సరఫరా జరిగేది. అయితే ప్రస్తుతం ప్రాసెస్ చేయబడిన నూలునే జైలుకు సరఫరా చేస్తున్నారు. ఉరితాడు తయారీకి ఇక్కడ ప్రత్యేక ఫార్మూలా కూడా ఉంది. ఇందుకోసం నలుగురైదుగురు ప్రత్యేక ఉద్యోగులు ఉన్నారు. తయారీకి సంబంధించి వీరికి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. బక్సర్ జైలుకు మాత్రమే ఉరితాళ్లను తయారుచేసేందుకు అనుమతి ఇవ్వడానికి కారణం.. అక్కడి వాతావరణం,నీటి సదుపాయం అని చెబుతారు. గంగా నది ఒడ్డున ఈ జైల్లో ఓ బావి కూడా ఉంది. సాధారణంగా భారత్లోని జైళ్లలో ఎక్కడా బావులు ఉండటం కనిపించదు. ఖైదీలు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నందునా జైళ్లలో దాదాపుగా బావులు లేకుండా చేశారు.