కాంగ్రెస్ కు షాక్ మీద షాక్: కర్ణాటకలో రెండో వికెట్ పథనం, గోకాక్ ఎమ్మెల్యే రాజీనామా, బెంగళూరులో !
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. సోమవారం ఉదయం బళ్లారి జిల్లా విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం బెళగావి జిల్లా గోకాక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాజీనామా చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
24 గంటల్లో రెండు వికెట్లు !
కర్ణాటక శాసన సభ స్పికర్ రమేష్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి రాజీనామా పత్రం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఆయన పదవికి రాజీనామా చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆనంద్ సింగ్ రాజీనామా చేసిన 24 గంటలు గడువక ముందే రమేష్ జారకిహోళి రాజీనామా చెయ్యడంతో సంకీర్ణ ప్రభుత్వం పెద్దలు ఉలిక్కిపడ్డారు.
మంత్రి డీకే శివకుమార్ జోక్యం ?
తనను మంత్రి పదవి నుంచి తప్పించారని, బెళగావి జిల్లా రాజకీయాల్లో మంత్రి డీకే. శివకుమార్ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొంత కాలం నుంచి రమేష్ జారకిహోళి అసంతృప్తితో ఉన్నారు. ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు బెంగళూరు బయలుదేరారని తెలిసింది.
హోం మంత్రి ధీమా
ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని జేడీఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కర్ణాటక హోం శాఖా మంత్రి ఎంబీ. పాటిల్ ధీమా వ్యక్తం చేశారు.
సిద్దూ ఇంటికి పరుగు
సోమవారం సాయంత్రం బెంగళూరులో మాజీ సీఎం సిద్దరామయ్య నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటి దగ్గరకు పరుగు తీశారు.
మాజీ ప్రధాని దేవేగౌడ
సంకీర్ణ ప్రభుత్వంలోని తాజా రాజకీయాలను మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ బెంగళూరు నగరంలోని పద్మనాభనగరలోని ఆయన నివాసం నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వెయ్యడంలో దిట్ట అని పేరు ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ ఎలాంటి అడుగులు వేస్తారో వేచిచూడాలి.