బంగారం ధరలో మహాపతనం: రూ.4 వేలకు పైగా: కారణమేంటో తెలుసా?
ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నాలుగు రోజులుగా నేల చూపులు చూస్తూ వచ్చిన బంగారం ధరల గ్రాఫ్.. అదే స్థాయిలో క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరల్లో అదే తరహా పతనం కనిపించింది. విదేశీ మార్కెట్లో ఏడేళ్ల తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో గోల్డ్ రేట్లు పడిపోయాయి. పెరుగుట విరుగట కొరకే అన్నట్టు- మొన్నటిదాకా భారీగా పెరిగిన బంగారం రేట్లు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యాయి. నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు వేల రూపాయలకు పైగా క్షీణత నమోదైంది.
బంగారం, వెండి ధరలు.. మహాపతనం - ప్రెస్ రివ్యూ
కొనుగోళ్లు తగ్గినా..
నిజానికి- కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల్లోనూ బంగారం రేట్లు దిమ్మతిరిగేలా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా 57 వేల రూపాయల మార్క్ను అందుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ విధించడం, శుభకార్యాలను నిర్వహించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులను ఇవ్వడం, కొద్దో గొప్పో బంగారాన్ని కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాలు కూడా పసిడి వైపు కన్నెత్తి చూడలేకపోయారు. శుభకార్యాలు ఉన్నప్పటికీ.. బంగారాన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.
గరిష్ఠ స్థాయికి బంగారం రేటు..
అలాంటి పరిస్థితుల్లోనూ బంగారం రేట్లల్లో భారీగా పెరుగుదల కనిపించింది. గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అనంతరం నేలచూపులు చూస్తూ వచ్చింది. నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు వేల రూపాయలకు పైగా తగ్గింది. ఇంత హఠాత్తుగా బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకోవడం, ఆ వెంటనే క్షీణించడం పట్ల మార్కెట్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడం వల్లే బంగారం ధరలు తగ్గముఖం పట్టాయని మార్కెట్ వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి.
డాలర్ బలహీనపడటమే కారణం?
అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్థాయిలో పసిడి రేట్ల తగ్గడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారిగా అంచనా వేస్తున్నారు. బంగారం క్రయ, విక్రయాల్లో క్షీణత తరువాత కొద్దిగా కోలుకుని ఒకశాతం మేర పెరుగుదల కనిపించింది. డాలర్ ఇండెక్స్ 0.2 శాతానికి పడిపోయింది. దీని ప్రభావం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ట్రేడింగ్పై పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలర్ రేటు 0.2 శాతం బలహీన పడటానికి అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే కారణమని అంటున్నారు. ప్రపంచంలో ఆర్థికంగా రెండు అత్యంత శక్తిమంతమైన దేశాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ వల్ల డాలర్ విలువ బలహీనపడిందని అంటున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రకారం..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) రేట్ల ప్రకారం.. బంగారం రేటులో 310 రూపాయల క్షీణత కనిపించింది. 52,254 రూపాయల నుంచి దిగజారింది. 51,944 రూపాయల వద్ద నిలిచింది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ ట్రేడ్ ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో 4,240 పతనం నమోదైంది. శుక్రవారం నుంచి ఈ క్షీణత కనిపించింది. 56,191 రూపాయల నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది బంగారం ధర. వెండి రేటు కూడా అదే స్థాయిలో తగ్గింది.
అమెరికా, చైనా ట్రేడ్ వార్ వల్ల తగ్గిన డాలర్ విలువ..
చైనాకు చెందిన యాప్లను నిషేధించడానికి అమెరికా సన్నాహాలు చేస్తుండటం, అదే సమయంలో చైనాలోని అమెరికా అధికారులపై ఆంక్షలను విధించడం వంటి చర్యల వల్ల డాలర్ విలువ 0.2 శాతం మేర బలహీన పడినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీన ఈ రెండు దేశాల మధ్య చోటు చేసుకునే వాణిజ్య చర్చలపై అందరి దృష్టీ నిలిచింది. ఈ చర్చల తరువాత డాలర్ విలువ మరింత పెరగడమా? తగ్గడమా? అనేది తేలుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.