12 బంగారం బిస్కెట్లు.. అరికాళ్లకు అంటించుకుని..
తన అరికాళ్లకు ఆరేసి బంగారం బిస్కెట్లు అంటించుకుని.. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడు ఒకరు ముంబై విమానాశ్రయంలో ఏఐయూ అధికారులకు పట్టుబడ్డాడు.
ముంబై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా సరే తీరా విమానాశ్రయంలో దిగాక.. అక్కడి అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.
తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడు ఒకరు ఇలా బంగారం తరలిస్తూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. 12 బంగారం బిస్కెట్లతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) అధికారులకు పట్టుబడ్డాడు.
ఒక్కో బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉంది. వీటి ధర రూ.36,45,600గా అధికారులు అంచనా వేశారు. వీటిని తరలించేందుకు నిందితుడు అనుసరించిన విధానం చూసి ఏఐయూ అధికారులే అవాక్కయ్యారు.
మొత్తం 12 బంగారం బిస్కెట్లను నిందితుడు తన రెండు అరికాళ్లకు అంటించుకున్నాడు. ఆపైన ఏమీ ఎరుగని అమాయకుడిలా విమానం దిగాడు. ఇతగాడి ఒక్కో పాదానికి అడుగున ఆరేసి బిస్కెట్లు ఉన్నాయి. అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బండారం బట్టబయలైంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.