మహిళా ఏఎస్ఐ గొలుసు లాక్కెళ్లారు
కోల్ కతా: విధులు నిర్వర్తించుకుని ఇంటికి వెలుతున్న మహిళా ఏఎస్ఐ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కోల్ కతా నగరంలో జరిగింది. నిర్మలారాయ్ అనే మహిళా ఏఎస్ఐ పై అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
కోల్ కతా లోని తిల్జాలా పోలీస్ స్టేషన్ లో నిర్మలారాయ్ ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈమె విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్నారు. మార్గం మద్యలో పిక్నిక్ గార్డెన్ సమీపంలో బైక్ లో వెళ్లిన ఇద్దరు నిందితులు నిర్మలారాయ్ ని అడ్డగించారు.
తరువాత ఆమె మెడలో ఉన్న విలువైన బంగారు గొలుసు లాక్కెళ్లారు. షాక్ కు గురైన నిర్మలారాయ్ గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. తరువాత నిర్మలారాయ్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న లాల్ బజార్ క్రైం విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.
పాత నేరస్తుల వివరాలు సేకరిస్తున్నామని, సీసీ టీవీ కెమెరాల పుటేజ్ ల ఆదారంగా వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారే బంగారు గొలుసు లాక్కోని వెళ్లి ఉంటారని నిర్మలారాయ్ అనుమానం వ్యక్తం చేశారు.
దేశంలోని అనేక రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో విచ్చలవిడిగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కోని దర్జాగా పారిపోతున్నారు. ఇప్పుడు మహిళా పోలీసులను చైన్ స్నాచర్లు టార్గెట్ చేసుకున్నారు.