స్కూల్ ఫీజు కోసం పనిమనిషిగా మారిన బాక్సింగ్ ఛాంపియన్
ఛండీగఢ్: హర్యానా రాష్ట్ర బంగారు పతక విజేత అయిన బాక్సింగ్ ఛాంపియన్ రిషూ మిట్టల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరవాల్సిన ఆమె ఆర్థిక ఇబ్బందులతో తన పాఠశాల ఫీజు కట్టుకోలేని స్థితి చేరుకుంది.
ఈ నేపథ్యంలో తన పాఠశాల ఫీజు చెల్లించేందుకు ఆమె పనిమనిషిలా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఆమె 2014లో రాష్ట్రా స్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు.
అంతేగాక, నిరుడు గ్వాలియర్లో జరిగిన జాతీయ క్రీడల్లో హర్యానా తరపున ఆమె ప్రాతినిథ్యం వహించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహం లభించకపోవడంతో ఆమె పనిమనిషిగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం మిట్టల్ 10 తరగతి చదువుతోంది. ఆమె తన సోదరుడితో కలిసి జీవిస్తోంది. అతడు ఓ వర్క్ షాపులో పని చేస్తున్నాడు. ‘రిషూ మిట్టల్ తల్లిదండ్రులు చనిపోయారు. తక్కువ జీతానికే ఆమె సోదరుడు ఓ షాపులో పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఇతర ఇళ్లల్లో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది' అని మిట్టల్ కోచ్ రాజేందర్ సింగ్ తెలిపారు.