తగ్గిన బంగారం ధరలు.. 6వారాల్లో తొలిసారి: డాలర్ పుంజుకోవడం వల్లే..
డాలర్ విలువ పుంజుకోవడం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలను దిగి వచ్చేలా చేసింది. గత జులై నెలలో రిటైల్ అమ్మకాలు పుంజుకోవడంతో బలహీనపడ్డ డాలరు ప్రస్తుతం బాగా పుంజుకుంది.
ముంబై: డాలర్ విలువ పుంజుకోవడం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలను దిగి వచ్చేలా చేసింది. గత జులై నెలలో రిటైల్ అమ్మకాలు పుంజుకోవడంతో బలహీనపడ్డ డాలరు ప్రస్తుతం బాగా పుంజుకుంది. దీంతో దేశీయంగా పసిడి విలువ రూ.154 మేర క్షీణించి రూ.28,926వద్ద కొనసాగుతోంది.
బుధవారం నాటి ఎంసీఎక్స్(మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్)లో పుత్తడి ధర ప్రస్తుతం రూ.28,926వద్ద కొనసాగుతోంది. తాజా ర్యాలీతో డాలర్ విలువ మూడు వారాల గరిష్టానికి చేరింది. అదే సమయంలో రిటైల్ విక్రయాలు 0.6శాతం మేర ఎగబాకడంతో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకే మొగ్గు చూపవచ్చన్న అంచనాలకు బలం చేకూరుతోంది.
ఈ పరిణామంతో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ ఇండెక్స్ 93.82కి చేరి పసిడి అమ్మకాలు పెరిగాయి. తద్వారా గత 6 వారాల్లో లేని విధంగా మంగళవారం విదేశఈ మార్కెట్లో పసిడి ధరలు పతనమయ్యాయి.
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్ లో ఔన్స్(31.1గ్రా.)బంగారం దాదాపు 1శాతం(11డాలర్లు) పడిపోయి 1280డాలర్ల దిగువన ముగిసింది. ఇక వెండి మరింత అధికంగా ఔన్స్ 2.4శాతం దిగజారి 16.71డాలర్లను తాకింది. 17డాలర్ల దిగువకు చేరింది.
పసిడి ఔన్స్ స్వల్ప వెనుకడుగతో 1279డాలర్ల సమీపానికి చేరగా.. వెండి ఔన్స్ 0.3శాతం క్షీణించి 16.67డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి కూడా మూడు వారాల కనిష్టాన్ని చేరుకుంది. 0.13 పైసలు కోల్పోయి కీలకమైన రూ.64 స్థాయికి పడిపోయి 64.25వద్ద కొనసాగుతోంది.
కాగా, ఆ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ లోకి బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఏప్రిల్-జులై త్రైమాసికంలో 13.35బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుతమి అయింది. గతేడాది ఇదే సమయంలో కరెంట్ అకౌంట్ లోటు 4.97బిలియన్ డాలర్లుగా ఉంది.