పెరిగిన బంగారం ధరలు: ఒక్క రోజులోనే రూ.300పైకి
ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ విపణిలో బంగారం ధర మరోసారి పెరుగుదల నమోదైంది. దీనికి తోడు అక్షయ తృతియ కూడా సమీపిస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. బుధవారం ఒక్కరోజే రూ.300 పెరిగడం గమనార్హం. దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 31,850కి చేరింది. ఈ వారంలో ఇదే గరిష్టం కావడం గమనార్హం.
స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. బుధవారం నాటి మార్కెట్లో రూ.360 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.39,760కి చేరింది.
పారిశ్రామిక వర్గాల, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు బులియన్ వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.40శాతం పెరిగింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు ధర 1,344.40 అమెరికన్ డాలర్లు పలికింది. వెండి కూడా 0.15శాతం పెరిగి ఔన్సు ధర 16.57 అమెరికన్ డాలర్లుగా ఉంది. కాగా, అమెరికా, చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఆంక్షల పరిణామాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.