కొండెక్కిన బంగారం ధరలు...10 గ్రాముల పసిడి రేటెంతో తెలుసా..?
Recommended Video
ముంబై: భారత్లో పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో 0.65శాతం పెరిగిన బంగారు ధర రికార్డు స్థాయిలో రూ.37,830 రూపాయలకు చేరుకుంది. ఇదే క్రమంలో వెండి ధరలు కూడా పెరిగాయి. అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధమే బంగారు ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డాలరుతో రూపాయి విలువ బలహీనపడటం కూడా గోల్డ్ ధరలు పెరుగుదలకు మరో కారణంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే బంగారు ధరలు అంతర్జాతీయంగా కూడా గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. అయితే అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో సంబంధం లేకుండా పసిడి ధరలు పెరుగుతున్నాయనే మరో వాదన వినిపిస్తోంది. చైనా కరెన్సీ యాన్ పడిపోవడంతో ఆ ప్రభావం బంగారు ధరలపై పడినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించడంతో ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ప్రకటించిన మోనిటరీ పాలసీలు కూడా ఎఫెక్ట్ చూపుతున్నాయి.
ఇక వెండి ధరలు కూడా బంగారంతో పాటే పెరిగిపోతున్నాయి. సింగపూర్ మార్కెట్లో స్పాట్లోనే ధరలు 2.2 శాతానికి పెరిగాయి.ఔన్సు సిల్వర్ ధర 15.8082 డాలర్లకు చేరుకుంది. గత ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్లో బంగారం దిగుమతులు కూడా తగ్గిపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుమతి 55శాతానికి పడిపోయింది. గత మూడేళ్లలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇక పాత బంగారంను చాలా మంది అమ్ముతుండటంతో దిగుమతి చేసుకోవడం కూడా కుదరడం లేదని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత నెలలో బంగారు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10శాతం నుంచి 12.5శాతంకు పెంచింది. అంటే 2.5శాతం అదనంగా పెంచడంతో బంగారు దిగుమతులు కూడా తగ్గిపోయాయి.
మొత్తానికి బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతుండటంతో దాని మాట ఎత్తాలంటేనే గృహిణులు భయపడుతున్నారు. బంగారం వైపు చూసేందుకు జంకుతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలతో నగల దుకాణాలు కూడా కస్టమర్లు లేక బోసిపోతున్నాయి.