అయ్యో! గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది.. ఎందుకంటే..
హైదరాబాద్ : బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. డిమాండ్ పెరగడంతో రేటు అమాంతం పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల ధర ఒక్కరోజే రూ.730 పెరిగి 35వేలు దాటింది. జ్యూయెలర్లు, రిటైలర్లు, కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ఒక కారణం కాగా... అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ పెరగడం దీనికి మరింత ఊపునిస్తోంది.
అంతర్జాతీయంగా పెరిగిన ధర
ప్రపంచంలో డిమాండ్ తగ్గని వస్తువేదైనా ఉందంటే అది బంగారమే. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గోల్డ్ మార్కెట్ మళ్లీ గాడిలో పడింది. ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 14వందల డాలర్లకు చేరింది. 2013 తర్వాత గోల్డ్ రేట్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అప్పట్లో ఔన్స్ బంగారం ధర 0.4శాతం పెరిగి 1402.60 డాలర్లుగా నమోదైంది.
బంగారం కొంటున్న బ్యాంకులు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆసియాలో చైనా, ఇండియా, కజకిస్థాన్, యూరోప్లో రష్యా, పోలెండ్, హంగేరీ తదితర దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇలా బ్యాంకులు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడంతో గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఆ ప్రభావం గోల్డ్ రేట్లపై పడిందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.
భవిష్యత్తులో కొనసాగనున్న ర్యాలీ
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ మార్కెట్పైనా పడింది. ఫలితంగా కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ రేటు 10 గ్రాముల ధర ఒకశాతానికి పైగా పెరిగి 34, 800కు చేరింది. మరికొంతకాలం గోల్డ్ రేటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ దేశాల బ్యాంకులు కొంటుండటం, కొన్ని దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరత ఇందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. ఫలితంగా ఔన్స్ బంగారం ధర 1435 నుంచి 1440 డాలర్ల మధ్యలో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.