Today gold price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. దీపావళి పర్వదినం నేపథ్యంలో కాస్తా పెరిగిన బంగారం ధరలు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్కరోజే రూ. 548 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 38,857కు పడిపోయింది.
బంగారంతోపాటు వెండి..
అయితే గత వారం రోజులుగా బంగారం మార్కెట్లో తులం మేలిమి బంగారం ధర రూ. 39వేలపైనే ఉండటం గమనార్హం. అటు వెండి ధర కూడా మంగళవారం భారీగానే పడిపోయింది. రూ. 1,190 తగ్గడంతో దేశ రాజధానిలో కిలో వెండి ధర రూ. 47,090గా ఉంది.
ఈ కారణాల వల్లే..
కాగా, పండగ సీజన్ పూర్తవడంతో బంగారం కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అమెరికా-చైనా మధ్య త్వరలో వాణిజ్య చర్చలు జరగనున్నట్లు వస్తున్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా దేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దంతెరాస్ రోజున తగ్గిన కొనుగోళ్లు
సాధారణంగా దంతెరాస్ రోజున బంగారం కొనుగోలు ప్రతిఏటా విరివిగా జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం బంగారం దుకాణాలు కొనుగోళ్లు లేక బేర్మన్నాయి. భారత్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం బంగారు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలా పరిమితితో బంగారం కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. ప్రపంచంలోనే బంగారం వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్... ఈ సారి మాత్రం గోల్డ్ మార్కెట్లు చాలా డల్గా కనిపించాయి. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఆర్థిక వృద్ధి మందగించడం, నిరుద్యోగం పెరిగిపోవడం, రుణాలు ఇవ్వలేకపోవడంతో నగదు ప్రవాహం లేకపోవడం వంటి అంశాలు బంగారు కొనుగోలుపై ప్రభావం చూపించాయని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.
దిగుమతులు తగ్గుముఖం
బంగారు దిగుమతులు వరుసగా మూడో నెలలో కూడా తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ ఎక్కువగా లేకపోవడంతో నగల తయారీదారులు కూడా బంగారు దిగుమతులను చాలావరకు తగ్గించివేశారు. ధంతెరాస్ వస్తుందని తెలిసి బంగారుదుకాణాదారులు బంగారం స్టాక్ను నిల్వచేసి ఉంచుకుంటారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించలేదు. ముంబైలోని బంగారు మార్కెట్లకు ప్రసిద్ధి గాంచిన జవేరీ మార్కెట్లో రద్దీ కనిపించలేదు.