పైపైకి.. బంగారం ధరకు రెక్కలు, మరింత ప్రియం..
బంగారం ధర మరింత పైపైకి వెళుతోంది. ధర తగ్గితే చాలు.. పండుగలు పక్కకుపెట్టి గోల్డ్ కొనేస్తారు. ధర పెరుగుతూ పోతుంటే పండగొచ్చినా.. పబ్బం వచ్చినా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేం ఉండదు. అదే తరహాలో అక్షయ తృతీయ వేళ కూడా పసిడి అమ్మకాలు వెలవెలబోయాయి.
దేశీయంగా పసిడి ధరలు పెరగడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల బంగార ధర రూ.348 పెరిగి రూ.47వేల 547కు చేరింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం రూ.49వేల 650గా ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు రూ.48వేల 980 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ పెరగడమే దీనికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యురిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు వెండి కూడా కిలో రూ.936 పెరిగి 71వేల 310కి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ ఔన్సు వెయ్యి 853 డాలర్లు ఉండగా, వెండి 27.70 డాలర్లు ఉంది.
యూఎస్ బాండ్ ఈల్డ్స్లో తగ్గుదల ఉండటంతో బంగారం ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. డాలర్ బలహీన పడటం, యూఎస్ ఈల్డ్స్ తగ్గుదల, అమెరికా ఎకానమీ సిస్టమ్ బలహీన పడటం వంటి కారణాలతో పసిడి ధరలు పెరిగి, మూడు నెలల గరిష్టానికి చేరినట్లు నిపుణులు అంటున్నారు.