హైదరాబాద్లో బంగారం ధరల కొత్త రికార్డ్... 10 గ్రాములకు రూ. 51 వేలు
కరోనా వైరస్తో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర రికార్డు స్థాయిలో పదిగ్రాములు రూ.50వేలు దాటిందని సాక్షి సహా పలు వార్తాపత్రికలు ప్రముఖంగా రాశాయి. వీటి ప్రకారం బుధవారంనాడు పదిగ్రాముల బంగారం రూ. 49,931తో ప్రారంభమై రూ.50వేలు దాటింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో పదిగ్రాముల బంగారం ఒక దశలో రూ.50,920 పలికింది. హైదరాబాద్లో పదిగ్రాముల బంగారం రూ.51,700లకు చేరిందని ఈనాడు పేర్కొంది.
కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తుండటంతో సురక్షితమైన పెట్టుబడికి బంగారం ఒక్కటే మార్గమని ఎక్కువమంది నమ్ముతుండటం వల్ల డిమాండ్ పెరిగిందని, అందుకే ధర ఈ స్థాయిలో పెరుగుతోందని నిపుణులు చెప్పినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి.
ఇటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్న ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ.2,550 పెరిగి రూ. 60,400కు చేరుకుంది. మార్చిదాకా ఓ మోస్తరుగా ఉన్న బంగారం వెండి ధరలు ఒక్కసారి ఊపందుకున్నాయని, అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్కౌంటర్ను నుంచి తృటిలో బైటపడ్డ ఆర్కే
ఏవోబీలో భారీ ఎన్కౌంటర్ తప్పిందని, మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారని ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఇచ్చింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు చలపతి, ఆయన భార్య అరుణకు గాయాలయ్యాయని ఈ కథనం వెల్లడించింది.
సంఘటనా స్థలం రక్తపు మరకలతో నిండిపోయిన దానిని బట్టి పోలీసులు అగ్రనేతలు గాయపడ్డారన్న అభిప్రాయానికి వచ్చారని, వారి కోసం గాలింపు జరుపుతున్నారని వెల్లడించింది. అమరులవీరుల వార్షిక వారోత్సవాలపై మావోయిస్టులు సన్నాహాల్లో ఉన్నారని, మూడు బృందాలుగా ఏవోబీలో సంచరిస్తున్నారని ఈ నెల 16న పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో అటు ఒడిశా పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 19న మూడు బృందాలుగా విడిపోయిన మిలిషియా సభ్యులు ఒడిశా, ఆంధ్రా సరిహద్దు గ్రామాల మీదుగా వెళుతున్నారని తెలిసి, పోలీసులు ఆ ప్రాంతంలో కాపు కాశారని, వ్యూహాత్మకంగా ఒకదళం వెళ్లేదాకా కాల్పులు జరపని పోలీసులు, రెండో దళం రాగానే బుల్లెట్ల వర్షం కురిపించారని ఈ కథనం పేర్కొంది. గాయపడిన చలపతి, అరుణ రెండో బృందంలో ఉన్నారు. మూడో దళంలో ఉన్న ఆర్కే, రెండో దళంపై కాల్పులు జరిగిన విషయం తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నారని, పైగా ఆ సమయంలో ఏవోబీలో వర్షం కురుస్తుండటంతో తప్పించుకోవడం సులభం అయ్యిందని, లేకపోతే భారీ ఎన్కౌంటర్ జరిగేదని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
గాయపడిన మావోయిస్టు అగ్రనేతల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, వారు దొరికితే మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు వర్గాలు వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.
- ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి
- తాలిబన్ల నుంచి ఏకే-47 లాక్కుని ఇద్దరిని చంపిన అఫ్గాన్ బాలిక
ప్రభుత్వం దివాలా తీసిందా? ఏపీ హైకోర్టు ప్రశ్న
ఈ-వేలం ద్వారా ప్రభుత్వ భూముల అమ్మకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు ఈనాడు దినపత్రిక రాసింది.
ఈ కథనం ప్రకారం, ప్రజల భూములు ఎందుకు అమ్ముతున్నారో తెలపాలని, అమ్మే హక్కు మీకు ఎక్కడిదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. భూములు అమ్మకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారా అని ప్రశ్నించింది. ప్రజాఆస్తుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతని, ఇలా అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్కడ దొరుకుతాయని న్యాయస్థానం ప్రశ్నించింది.
గుంటూరు, విశాఖ జిల్లాల్లో భూముల అమ్మకానికి ప్రభుత్వం వేలం నిర్వహిస్తోందని, అయితే ఇందులో ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలు ఉన్నందున దీన్ని అడ్డుకోవాలని కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఇవి ప్రభుత్వ భూములు కావని, ప్రజల భూములని, రెండింటికి మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఇవి ప్రజల ప్రయోజనం మేరకే అమ్ముతున్నామని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న ప్రభుత్వం విచారణకు సమయం కావాలని కోరినట్లు ఈ కథనం పేర్కొంది.
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: 'రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్టాక్ చూపించింది’
జీహెచ్ఎంసీలో మొబైల్ స్మశాన వాటిక
వీల్ ఆన్ క్రిమేషన్ పేరుతో మొబైల్ స్మశాన వాటిక అనే వినూత్న ప్రయోగాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించినట్లు ఆంధ్రప్రభ ఒక కథనం ఇచ్చింది.
కరోనా నేపథ్యంలో దహన సంస్కారాల విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులకు పరిష్కారంగా ఈ మొబైల్ స్మశాన వాటికను అభివృద్ధి చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ క్రిమేషన్ బాక్సుతో ఎక్కడ కావాలంటే అక్కడ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా ఎర్రగడ్డ స్మశాన వాటికలో దీన్ని ప్రయోగించి చూశారు. 1200 డిగ్రీల ఫారన్ హీట్తో రెండుగంటల్లో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.
నిమ్మగడ్డ నియామకంలో దాగుడు మూతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకంపై దాగుడు మూతలు కొనసాగుతున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఈ కథనం ప్రకారం హైకోర్టు తీర్పుపై తగిన చర్యలు తీసుకోండి అంటూ గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వెళ్లాయి.
అయితే, గవర్నర్ ఆదేశాలకు ఎవరికి వారు భాష్యాలు చెబుతున్నారని ఈ కథనం పేర్కొంది. గవర్నర్ ఆయన్ను ఎన్నికల కమిషనర్గా నియమించాల్సిందిగా ఆదేశాలివ్వలేదని ప్రభుత్వ వర్గాలు అంటుండగా, ఈ ఆదేశాలు ఆయన్ను రాష్ట్ర సీఈసీగా నియమించమని చెప్పినట్లేనని రమేశ్ మద్దతుదారులు వాదిస్తున్నారు.
గవర్నర్ ఆదేశాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొనగా, నిమ్మగడ్డ రమేశ్ రాజ్యాంగానికే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించినట్లు సాక్షి పేర్కొంది. బుధవారం నాడు గవర్నర్ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టు తీర్పు ప్రకారం తనను ఏపీ సీఈసీగా పునర్నియమించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేశ్ వేసిన ధిక్కార పిటిషన్పై హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 24న విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపై తీర్పును అనుసరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల 'సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో 'పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: 'లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ''ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)