గోల్డ్ మార్కెట్ : పండగ రోజున తగ్గిన పసిడి అమ్మకాలు..ఎందుకో తెలుసా..?
న్యూఢిల్లీ: సాధారణంగా దంతెరాస్ రోజున బంగారం కొనుగోలు ప్రతిఏటా విరివిగా జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం బంగారం దుకాణాలు కొనుగోళ్లు లేక బేర్మన్నాయి. భారత్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం బంగారు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలా పరిమితితో బంగారం కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. ప్రపంచంలోనే బంగారం వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్... ఈ సారి మాత్రం గోల్డ్ మార్కెట్లు చాలా డల్గా కనిపించాయి. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఆర్థిక వృద్ధి మందగించడం, నిరుద్యోగం పెరిగిపోవడం, రుణాలు ఇవ్వలేకపోవడంతో నగదు ప్రవాహం లేకపోవడం వంటి అంశాలు బంగారు కొనుగోలుపై ప్రభావం చూపించాయని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.
తగ్గిన పసిడి దిగుమతి
బంగారు దిగుమతులు వరుసగా మూడో నెలలో కూడా తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ ఎక్కువగా లేకపోవడంతో నగల తయారీదారులు కూడా బంగారు దిగుమతులను చాలావరకు తగ్గించివేశారు. ధంతెరాస్ వస్తుందని తెలిసి బంగారుదుకాణాదారులు బంగారం స్టాక్ను నిల్వచేసి ఉంచుకుంటారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించలేదు. ముంబైలోని బంగారు మార్కెట్లకు ప్రసిద్ధి గాంచిన జవేరీ మార్కెట్లో రద్దీ కనిపించలేదు.
గతేడాదితో పోలిస్తే 20శాతం సేల్స్ డౌన్
గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20శాతం పడిపోయాయని ఆలిండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మెన్ అనంత పద్మనాభన్ చెబుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, పెరిగిన బంగారు ధరలతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారని ఆయన చెప్పారు. వచ్చే రెండు మూడునెలల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది అప్పుడు పసిడిని కొనుగోలు చేద్దామన్న ఆలోచనతో ఉన్నారని అనంత పద్మనాభన్ చెప్పారు.
భవిష్యత్తులో రూ.41వేలు మార్క్ను తాకే అవకాశం
దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో బంగారం కోసం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొందరు దుకాణదారులు పండగకు పెళ్లిళ్ల సీజన్కు ఒకేసారి బంగారంను దిగుమతి చేసుకుంటున్నారు. ముందుగానే కొనిపెట్టుకున్న బంగారం ఆయా రోజున ఆయా రేటును బట్టి అమ్మకాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.సెప్టెంబర్ నెలలో ముంబైలో 10 గ్రాముల పసిడి ధర రూ.39,885గా ఉన్నింది. గతేడాది కంటే 20శాతం అధిక ధర పసిడి పలికింది. ఇక రానున్న 12 నెలల్లో పసిడి ధరలు రూ. 41,500 మార్కును తాకే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఒకప్పుడు గిఫ్ట్ అంటే గోల్డ్ ఐటమే..!
ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా కాస్లీ గిఫ్ట్ ఇవ్వాలంటే బంగారం రూపంలో ఐటెం ఇచ్చేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రూ.5వేల నుంచి రూ.10వేల మధ్య ఒక గోల్డ్ గిఫ్ట్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఒక గ్రాము బంగారం దాదాపుగా రూ.4500 పలకడంతో బంగారం గిఫ్ట్ ఇద్దామన్న ఆలోచనే దరిచేరనీయడం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇక వెండికి డిమాండ్ కూడా పడిపోయిందని అనలిస్టులు చెబుతున్నారు.