మళ్లీ పెరిగిన బంగారం ధరలు...మధ్య తరగతి వారికి అందని ద్రాక్షాగా పుత్తడి
ముంబై:దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో పుత్తడి ధరలు రూ. 40వేల మార్కును తాకాయి. దీంతో బంగారం మాట మాట్లాడాలంటేనే మధ్యతరగతి కుటుంబంవారు జంకుతున్నారు. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 40,260కు చేరుకుంది. అదే ముంబైలో రూ. 40వేలుగా ఉంది. ఇక పసిడి ధరతో పాటు వెండి ధరలు కూడా ఆకాశానంటాయి. కిలో వెండి ధర రూ. 45వేలుకు చేరుకుంది. రూ.44952గా ఉన్న కిలో వెండి ధర 0.78 శాతం పెరిగి రూ.45, 342కు చేరుకుంది. అయితే బంగారం ధరలు క్రమంగా పెరగడం వెనక కారణం అమెరికా చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధం
అమెరికా చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందం ఏర్పడుతోందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్యపరంగా ఆందోళనకర వాతావరణం నెలకొనడంతో ఆసియా ఇక్విటీ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఇన్వెస్టర్లు బంగారం ఇతర సావరిన్ బాండ్లపై ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు ఆయా దేశ కరెన్సీ విలువ పెరగడంతో కూడా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. రూపాయి విలువ పతనం దిశగా సాగడంతో ఆ ప్రభావం బంగారంపై కూడా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
గత ఆరేళ్లలో ఈ స్థాయిలో బంగారం పెరగడం ఇదే తొలిసారి
ప్రపంచ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఒక శాతం పెరిగి ఔన్స్కు 1,544.23 డాలర్లకు చేరింది. ఏప్రిల్ 2013 నుంచి ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక అమెరికా ఉత్పత్తులపై చైనా 75 బిలియన్ డాలర్ల మేరా సుంకం విధించడం దీనికి ప్రతీకార చర్యగా అమెరికా అధ్యక్షుడు చైనా వస్తువులపై రూ. 550 బిలియన్ డాలర్లు అధిక సుంకం విధించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్ జెరోమ్ పావెల్ శుక్రవారం ప్రకటించారు.
రాబోయే రోజుల్లో కిలో వెండి రూ.48వేలు అయ్యే ఛాన్స్
చైనా అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా బంగారంపై ప్రభావం చూపింది. రూపాయి విలువ పతనం కావడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణం అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్క బంగారమే కాకుండా వెండి ధరలపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో కిలో వెండి ధర రూ. 48వేల మార్క్ను తాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాదిలో బంగారం ధరలు ఏకంగా 20శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో భారత్లో నగల పరిశ్రమ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.