రూ. 3కోట్ల నగలతో నదిలో గోల్డెన్ బాబా స్నానం
హరిద్వార్: గత శుక్రవారం అర్థకుంభమేళాలో పాల్గొని స్నానం చేశారు ‘గోల్డెన్బాబా'. అందరిలాగే స్నానం చేస్తే ఆయన పేరుకేం ప్రత్యేకత ఉంటుంది. అందుకని ఆయన రూ.3 కోట్ల విలువైన 15.5 కిలోల బంగారు నగలు ధరించి హరిద్వార్ వద్ద గంగా నదిలో పుణ్యస్నానం చేశారు.
కాగా, ఆయన అసలు పేరు సుధీర్కుమార్ మక్కడ్. గతంలో ఆయన ఢిల్లీలో వ్యాపారం చేసేవారు. చిన్నవయసునుంచీ బంగారం ధరించడం ఇష్టపడిన ఆయన ఇప్పుడు ఏకంగా కిలోల లెక్కన బంగారాన్ని ధరిస్తున్నారు.
అయితే తన వద్ద ఎంత బంగారం ఉన్నదీ మాత్రం ఆయనకు ఖచ్చితంగా తెలియదని చెబుతుంటారు. ఈ బంగారు బాబాగారి వెంట ఓ అంగరక్షకుల బృందం కూడా ఉంది.
ప్రస్తుతం ఆయన సాధువుగా మారి నిరాడంబర జీవితం గడుపుతున్నారట. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది పాల్గొనే భక్తి సంబంధ కార్యక్రమాల్లో అర్ధ కుంభమేళా ఒకటి. కాగా, లక్షల మంది భక్తులు, సాధువులు పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానాలాచరిస్తారు.
జనవరి 12న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్రావత్ ఈ కుంభమేళాను ప్రారంభించారు. ఏప్రిల్ 22 వరకు ఈ మేళా జరగుతుంది. గత శుక్రవారం ఇక్కడికి వచ్చిన గోల్డెన్ బాబా నదిలో స్నానం చేశారు. కాగా, ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.