గోల్డెన్ బే రిసార్టు మూసివేత.. 'డ్యామేజీ'కి మరమ్మత్తులు..
'గోల్డెన్ బే రిసార్టు' తమిళనాడు క్యాంపు రాజకీయాల పుణ్యమాని ఈ పేరు దేశమంతా మారుమోగింది. వారానికి పైగా సాగిన శశికళ-పన్నీర్ వార్ లో పన్నీర్ ను అధికారానికి దూరం చేసింది ఈ రిసార్టే.
చెన్నై: 'గోల్డెన్ బే రిసార్టు' తమిళనాడు క్యాంపు రాజకీయాల పుణ్యమాని ఈ పేరు దేశమంతా మారుమోగింది. వారానికి పైగా సాగిన శశికళ-పన్నీర్ వార్ లో పన్నీర్ ను అధికారానికి దూరం చేసింది ఈ రిసార్టే.
ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా జాగ్రత్తపడ్డ అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ రిసార్టు నుంచే క్యాంపు రాజకీయాలను చక్కబెట్టారు. అధికారం తనకు దూరమైనా.. పన్నీర్ కు మాత్రం దక్కవద్దన్న ఉద్దేశ్యంతో పళనిస్వామిని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారు.
కాగా, ఇంతటి రాజకీయ ప్రస్తావనకు కేంద్రంగా మారిన గోల్డెన్ బే రిసార్టును తాత్కాళికంగా మూసేశారు. రిసార్టులో మరమ్మత్తుల కోసం తాత్కాళికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పోలీసుల తనిఖీల సందర్బంలో రిసార్టు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో లోపల కొంత డ్యామేజీ జరిగినట్లుగా యాజమాన్యం చెబుతోంది.
ఇదిలా ఉంటే, డీఎంకె నేతల ఆందోళనల మధ్యలోనే విశ్వాస పరీక్షలో పళనిస్వామి నెగ్గారు. మార్షల్స్ సహాయంతో డీఎంకె సభ్యులను, కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి బయటకు పంపించాక స్పీకర్ ఓటింగ్ పూర్తిచేశారు. అనంతరం మూజువాణి ద్వారా పళనిస్వామి నెగ్గినట్లుగా ఆయన ప్రకటించారు. 122మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతుగా, 11మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా స్పీకర్ వెల్లడించారు.