‘గోలీమారో’ నినాదంపై దద్దరిల్లిన లోక్సభ.. మంత్రి అనురాగ్ ఠాకూర్ను అడ్డుకున్న కాంగ్రెస్ ఎంపీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద నినాదం 'దేశ్ కే గద్దారోంకో.. గోలీమారో సాలోంకో(దేశద్రోహుల్ని కాల్చిపారేయండి)'పై సోమవారం లోక్ సభ దద్దరిల్లింది. మంత్రిగా ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన అనురాగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుపట్టడంతో సభాకార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష పార్టీలు.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు చేశారు. లోక్ సభలో ముందుగా ప్రశ్నోత్తరాలు పూర్తిచేద్దామని స్పీకర్ ఓం బిర్లా సూచించినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. గందరగోళం మధ్యనే క్వశ్చ అవర్ చేపట్టారు. ఓ సభ్యుడి ప్రశ్నకు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానమిస్తుండగా కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు.
మంత్రి అనురాగ్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. 'ఎక్కడున్నాయి మీ బుల్లెట్లు?' 'ఇకనైనా బుల్లెట్లు పేల్చడం ఆపండి(గోలీ మార్నా బంద్ కరో)' అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఇవేవీ పట్టనట్లు చకచకా సమాధానం చదవేసి మంత్రి తన సీట్లో కూర్చుండిపోయారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 'గోలీమారో' నినాదం తర్వాత.. ఢిల్లీలోని జామియా వర్సిటీ దగ్గర సీఏఏ వ్యతిరేక ప్రదర్శన చేస్తోన్న విద్యార్థులపై యూపీకి చెందిన రాంభక్త్ గోపాల్ శర్మ అనే టీనేజ్ బాలుడు కాల్పులు జరపడం తెలిసిందే. మంత్రులు, బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నందుకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోలీమారో కామెంట్లను తప్పుపట్టిన ఎన్నికల సంఘం.. ఢిల్లీలో ప్రచారం చేయరాదంటూ మంత్రిపై నిషేధం విధించింది.