మళ్లీ అదే కలకలం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో 'గోలీ మారో' నినాదాలు..
ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో శనివారం కొంతమంది వ్యక్తులు 'దేశద్రోహులను కాల్చిపారేయండి..(దేశ్కి గద్దరోన్ కో,గోలి మారో సాలోంకో)' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గతంలో ఇదే నినాదం సీఏఏ ఆందోళనకారులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్,కపిల్ మిశ్రాలు చేశారు.
తాజా ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(DMRC) ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. మెట్రో పరిసరాల్లో శనివారం ఉదయం 10.50గంటలకు కొంతమంది వ్యక్తులు ఆ నినాదాలు చేసినట్టు వెల్లడించింది. వెంటనే అప్రమత్తమై వారిని పోలీసులకు అప్పగించినట్టు తెలిపింది. వారంతా కాషాయ దుస్తులు,కుర్తాలు ధరించి ఉన్నారని.. మెట్రో స్టేషన్కు ఓ రైలు చేరుకుంటున్న సమయంలో నినాదాలు చేయడం మొదలుపెట్టారని తెలిపింది. రైలు నుంచి ప్రయాణికులు కిందకు దిగిన తర్వాత కూడా వారు అదే నినాదాలను కొనసాగించారని.. కొంతమంది ప్రయాణికులు కూడా వారితో గొంతు కలిపారని పేర్కొంది. స్టేషన్లో ఉన్న చాలామంది ఈ అనూహ్య ఘటనకు విస్తుపోయారని తెలిపింది. వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది.
ఢిల్లీ మెట్రో ఆపరేషన్&మెయింటెనెన్స్ చట్టం 2002 ప్రకారం మెట్రో పరిసరాల్లో ఎలాంటి ప్రదర్శనలు,న్యూసెన్స్ చేయరాదు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే మెట్రో పరిసరాల నుంచి వారిని పంపించేస్తారు. ఇదిలా ఉంటే,గురువారం హర్యానాలోని గురుగ్రాంలో హిందూసేన కార్యకర్తలు కూడా 'దేశద్రోహులను కాల్చిపారేయండి' అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
సివిల్ లైన్స్, గురుద్వార్ రోడ్, సర్దార్ బజార్లలో నిర్వహించిన ర్యాలీల్లో ఈ నినాదాలు చేశారు.ఢిల్లీ అల్లర్లు చల్లబడిన రెండు రోజులకే గురుగ్రామ్లో ఈ ఘటన చోటు చేసుకోవడం.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా 'దేశ ద్రోహులను కాల్చిపారేయండి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా నేత్రుత్వంలో సీఏఏకి మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో ఇదే నినాదాలు చేశారు. వీరితో పాటు బీజేపీ నేతలు పర్వేష్ వర్మ,అభయ్ వర్మలు కూడా వివాదాస్పద ప్రసంగాలు చేశారు.
ఢిల్లీ అల్లర్ల పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ఈ నలుగురి విద్వేషపూరిత ప్రసంగాలను కోర్టులో హాలులోనే న్యాయమూర్తి మురళీధర్ ప్రదర్శించారు.ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై ఎందుకు కేసులు బుక్ చేయడం లేదని ప్రశ్నించారు. క్రైమ్ జరిగిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమీ కావాలని జస్టిస్ మురళీధర్ ఢిల్లీ పోలీసులను నిలదీశారు.