రోడ్డు సాఫీనా: డిసెంబర్ 10న టీ బిల్లు? (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) దూసుకుపోతున్నట్లే కనిపిస్తోంది. జివోఎం కసరత్తు ఎప్పటికప్పుడు పూర్తవుతుందని భావిస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో సమయం అనుకున్నదాని కన్నా ఎక్కువ పడుతోంది. కాగా, డిసెంబర్ 10వ తేదీన బిల్లును లోకసభలో ప్రతిపాదించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎప్పటికప్పుడు రాష్ట్రంలో రోడ్ మ్యాప్ రాద్ధాంతం ముందుకు వస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ విషయం ఎటూ తేలలేదు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అని కేంద్రం ప్రకటించినా పరిధిలో స్పష్టత లేదు. ఉమ్మడి రాజధాని అయితే హెచ్ఎండిఎ పరిధిని చేర్చాలని కొందరు సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రెవెన్యూ పరిధి మాత్రమే ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధి వస్తుందని జిఓఎం నుంచి వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉండగా హైదరాబాద్ను యుటి చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు గట్టిగా పట్టు పడుతున్న విషయం తెలిసిందే. యుటి వద్దని హైదరాబాద్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మజ్లీస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేస్తున్నారు.. హైదరాబాద్ వివాదం రగులుతుండగానే భద్రాచలం అంశం తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం సీమాంధ్రకు సంబంధించినవనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనికి తోడు మునగాల పరగణా కూడా సీమాంధ్ర ప్రాంతంలోనిదే అనే వివాదం ప్రారంభమైంది.
శ్రీశైలం ఎడమ ప్రాజెక్టు కర్నూలులోనిదనే అంశం లేవనెత్తుతున్నారు. తాజాగా మంత్రి టిజి వెంకటేష్ అలంపూర్, గద్వాల తదితర ప్రాంతాలు కర్నూలులో కలపాలని కోరుతున్నారు. అయితే తెలంగాణ వాదులు పై అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాల్లో పెద్దెత్తున ఆందోళనలు చేస్తున్నారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణదే అని ఖమ్మం ప్రజాప్రతినిధులు ఢిల్లీ స్థాయిలో తమ వాదనను వినిపిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉన్నట్లు అటవీశాఖ రికార్డుల్లో ఉందని అంటున్నారు. అదేవిధంగా భద్రాచలం డివిజన్, మునగాల ప్రాంతాలు సీమాంధ్రప్రాంతంలో ఉన్నాయని పరిపాలన సౌలభ్యం కోసం వాటిని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చేర్చారని చెబుతున్నారు. వీటికి జివోఎం ఏ విధమైన పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
వీరప్ప మొయిలీ ఇలా..
రాష్ట్ర విభజనపై జివోఎం వరుసగా కసరత్తు చేస్తోంది. 21వ తేదీన విభజన నివేదికకు జివోఎం తుది రూపు ఇస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. మరోసారి ఈ నెల 27వ తేదీన సమావేశం కావడానికి సిద్ధపడుతున్నారు. జీవోఎంలో రాష్ట్రంతో అనుబంధం ఉన్న వీరప్ప మొయిలీది కీలక పాత్రే.
జైరాం రమేష్ కీలకం..
జివోఎంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ది కీలక పాత్ర. నివేదికను రూపుదిద్దుతోంది జైరాం రమేషే. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి ఆయన ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
సుశీల్ కుమార్ షిండే చేతుల మీదుగా..
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాష్ట్రంతో అనుబంధం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ఈ స్థితిలో ఆయన చేతుల మీదుగా రాష్ట్ర విభజన జరుగుతోంది. రాష్ట్ర సమస్యలపై ఆయన పూర్తి అవగాహన ఉందని భావిస్తున్నారు.
మీడియాతో రోజుకో మాట..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రోజుకో మాట మాట్లాడుతున్నారు. అయితే, తెలంగాణ బిల్లును మాత్రం శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదిస్తామని కచ్చితంగా చెబుతున్నారు.
సమైక్య నినాదాలు..
రాష్ట్ర విభజనకు జివోఎం పెద్ద యెత్తున కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సమైక్య నినాదాల హోరు వినిపిస్తూనే ఉంది. ఢిల్లీ వీధుల్లో ఇలా సమైక్యవాద బ్యానర్లతో తెలుగువాళ్లు..
పెద్ద దిక్కు ఆంటోనీ..
రాష్ట్ర విభజన విషయంలో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. ఆయనను ముందు పెట్టి విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం ముందుకు నడిపిస్తోంది.
కావూరి ఝలక్..
జీవోఎంకు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకపోతే విభజన ప్రక్రియను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
షిండే వేసే రోడ్డు సాఫియేనా..
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర విభజనకు వేస్తున్న రోడ్డు సాఫీగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణీత కాలవ్యవధిలో విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.