సుబ్రమణ్యస్వామి సంచలనం : 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు గుడ్ బై చెప్పాలని కామెంట్ ...
న్యూఢిల్లీ : స్వపక్షంలో విపక్షంలా మెలిగే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల విలీనం, స్ధూల దేశీయోత్పత్తి తగ్గిన తర్వాత స్వామి కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. నూతన ఆర్థిక విధానాలు లేకుండా ఎలా సాధ్యమంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్లో స్వామి స్పందించారు.
రెండోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ సర్కార్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో భారీ లక్ష్యాలు పెట్టుకుంది. సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ... లక్ష్యాలను వివరించింది. ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యమని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే దేశ స్థూల దేశియోత్పత్పి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2019-2010 తొలి త్రైమాసికంలో 5 శాతానికి చేరింది. గత క్వార్టర్తో పోలిస్తే పాయింట్ 8 శాతం తగ్గింది. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి స్పందించారు. తన ట్విట్టర్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ట్వీట్ చేశారు.
Get ready to say good bye to ₹ 5 trillion if no new economic policy is forthcoming. Neither boldness alone or knowledge alone can save the economy from a crash. It needs both. Today we have neither
— Subramanian Swamy (@Swamy39) August 31, 2019
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నూతన ఆర్థిక విధానాలను నరేంద్ర మోడీ సర్కార్ రూపొందించలేదు. భవిష్యత్లో రూపొందిస్తారనే గ్యారంటీ కూడా లేదు. ఈ క్రమంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యం లేదని .. దానికి గుడ్ బై చెప్పాల్సిందేనని ట్వీట్ బాంబ్ పేల్చారు. కొత్త విధానాలు, సంస్కరణలు లేకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు సుబ్రమణ్య స్వామి. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టాలంటే ధైర్యం మాత్రమే కాదు.. జ్ఞానం కూడా కావాలి.. విజ్ఞతతో వ్యవహరించి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అభిప్రాయపడ్డారు. అలాంటి చర్యలతోనే ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో పయనిస్తోందని చెప్పారు. ఈ రెండు అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు తప్పనిసరి అని .. కానీ ఆ రెండింటినీ మనం మరచిపోయామని సునీశితంగా విమర్శించారు.