గుడ్ న్యూస్: ఎగరనున్న విమానాలు... ఎప్పుడో తెలుసా..? బుకింగ్స్ పై క్లారిటీ..!
కరోనావైరస్ నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం రద్దు చేసింది కేంద్రం. అయితే తాజాగా విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ. దాదాపు రెండు నెలలుగా విమానాశ్రయాలకే పరిమితమైన విమానాలు త్వరలో ఆకాశంలో ఎగిరేందుకు సిద్ధమవుతున్నాయంటూ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. 25 మే సోమవారం నుంచి విమానాలు తిరిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం విమాన సర్వీసులు దేశీయంగా మాత్రమే అందుబాటులో ఉంటాయని అంతర్జాతీయ సర్వీసులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
ఆ రాష్ట్రంలో తగ్గిన కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య... ఆ మంత్రం ఫలించిందన్న ప్రభుత్వం
ఇక విమాన సర్వీసులు ప్రారంభించాలని డిసైడ్ అయిన నేపథ్యంలో కేంద్రం ప్రయాణికులకోసం పలు మార్గదర్శకాలను తయారు చేస్తోంది. సీటింగ్ విధానం, టికెట్ బుకింగ్తో పాటు ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో ఒక విధానంను ప్రవేశపెట్టనుంది. ఇక లాక్డౌన్ అమల్లోకి రావడంతో అత్యంత భారీగా సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ నష్టపోయింది. ఇక విమానాయాన రంగంను లాభాల బాటపట్టించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. మార్చి 25 నుంచి విమానాశ్రయాలకే పరిమితమైన విమానాలు ఇక రెక్కలు విప్పి గగన తలంలో విహరిస్తాయని వెల్లడించారు. అయితే ఇది దశలవారీగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పలు దేశీయ విమానాయాన సంస్థలు టికెట్లు జారీ చేయడం ప్రారంభించాయి.
మే 25వ తేదీనుంచి అన్ని ఎయిర్ క్రాఫ్ట్లు ఎయిర్ క్యారియర్లు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో కూడా కావాల్సిన ఏర్పాట్లను చేయాలని సూచించడం జరిగిందని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఇక దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్ 4.0ను ప్రకటిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు రంగాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే రైళ్లు, బస్సులను కూడా తిప్పేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే బస్సులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేశాయి. ఇక రైల్వేశాఖ కూడా కేంద్రం జారీ చేసిన గైడ్లైన్స్ను పాటిస్తోంది.