ఇళ్లు కట్టుకోవాలనే వారికి శుభవార్త: గృహ రుణాల పన్నుమినహాయింపు పరిమితిని పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: గృహాలు కొనాలనుకునే వారికి ఇది గుడ్న్యూస్ అని చెప్పాలి. జూలై 5వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏముంటుందో అని చాలా మంది ఆతురతగా ఎదురు చూశారు. ఇక గృహ రుణాలపై ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిమతిని పెంచుతున్నట్లు చెప్పడంతో ఇంటి కోసం లోన్ తీసుకోవాలనుకునే మధ్య తరగతి కుటుంబాలకు ఊరటనిచ్చింది.
గృహం కోసం గరిష్టంగా రూ.45 లక్షలు రుణం తీసుకుంటే ఇప్పటి వరకు పన్ను మినహాయింపు పరిమితి రూ.2 లక్షలుగా ఉండేది. అయితే కొత్త ప్రకటనతో ఈ పన్ను మినహాయింపు పరిమితి రూ.3.5 లక్షలకు పెరిగింది. ఈ నిర్ణయంతో హౌజింగ్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఇళ్లు అనే పథకం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ పన్ను మినహాయింపు ఆఫర్ కోఆపరేటివ్ సొసైటీ, కంపెనీలకు, పరిశ్రమలకు వర్తించదు. కేవలం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది.
మరోవైపు తొలిసారిగా గృహ నిర్మాణం కోసం రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి మాత్రమే ఈ పన్నుమినహాయింపు పద్దతి వర్తిస్తుందని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక గృహం కలిగి ఉన్నవారు ఈ స్కీమ్కు అర్హులు కారు. రూ. 45 లక్షలు గృహ రుణాలపై పన్ను మినహాయింపు పరిమితి ఉంది. అయితే మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం భారం కాకూడదన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇక ఇంటి కోసం రుణం పొందాలనుకునే వారు బ్యాంకు నుంచి కానీ ప్రభుత్వం గుర్తించిన హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి కానీ రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కత, హైదరాబాదులో కార్పెట్ ఏరియా ప్రాపర్టీ 645 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉండరాదనే నిబంధన ఉంది. ఇక ఇతర నగరాలు, పట్టణాల్లో కార్పెట్ ఏరియా 968 చదరపు అడుగులు ఉండొచ్చు. ఈ పన్ను మినహాయింపు కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్ 80ఈఈఏ కింద పొందొచ్చు.