గుడ్న్యూస్: ఐఐటీల్లో అమ్మాయిలకు 20శాతం అదనపు సీట్లు..ఎలా అంటే..?
న్యూఢిల్లీ: ఐఐటీలో చదవాలనే విద్యార్థినిలకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదవాలనే అమ్మాయిలకు మహిళా కోటా కింద ఇప్పటికే ఉన్న 20శాతం రిజర్వేషన్లకు అదనంగా మరికొన్ని సీట్లు కేటాయించనుంది. సూపర్ న్యూమరీ పద్ధతిలో ఐఐటీలు ఈ సీట్లను కేటాయించనుంది. ఐఐటీల్లో అదనపు సీట్ల కేటాయింపు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపదని అధికారులు చెప్పారు. అంతేకాదు అమ్మాయిలు తమకు ఇష్టమొచ్చిన క్యాంపస్ సెలెక్ట్ చేసుకునేలా ఓ ప్రత్యేక మెరిట్ లిస్టుకూడా తయారు చేయడం జరుగుతుందని అధికారుల తెలిపారు.
గతేడాది ఐఐటీల్లో మహిళల రిజర్వేషన్ 17 శాతం ఉండగా అంతకుముందు అంటే 2018లో ఇది 14శాతంగా ఉన్నింది. అయితే ఇక రిజర్వేషన్లు కాకుండా అదనపు సీట్లు కేటాయింపును ఐఐటీ మండి క్యాంపస్ డైరెక్టర్ గొన్సాల్వేస్ నేతృత్వంలోని ఓ కమిటీ సూచించింది. పలు అంశాలను చర్చించేందుకు సమావేశమైన కమిటీ కొన్ని కీలక విషయాలను గుర్తించింది.
ఐఐటీలకు క్వాలిఫై అవుతున్న విద్యార్థుల్లో అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే వారుంటున్న ప్రదేశాలకు దూరంగా ఉన్న ఐఐటీల్లో చేరేందుకు విముఖత చూపిస్తున్నారు. ఐఐటీలో సీటు వచ్చినప్పటికీ ఆ క్యాంపస్ దూరంగా ఉండటంతో అక్కడ చేరడం మానేసి ఇంటికి దగ్గరలోని ఇతర ఇన్స్టిట్యూట్స్లో చేరుతున్నారని కమిటీ గుర్తించింది. ఇప్పటి వరకు జేఈఈ అడ్వాన్స్డ్లో కానీ ఐఐటీలో కానీ అమ్మాయిలూ టాపర్గా నిలవలేదు.
ఇదిలా ఉంటే విదేశీ విద్యార్థులకు ఐఐటీల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇది కూడా సూపర్ న్యూమరీ పద్దతిలోనే కేటాయించడంతో అదనంగా 1100 సీట్లు విదేశీ విద్యార్థులకు వెళ్లనున్నాయి. ఐఐటీల్లో అడుగుపెట్టాలంటే విదేశీ విద్యార్థులకు జేఈఈ మెయిన్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు.
అయినప్పటికీ ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. అయితే భారతీయ విద్యార్థులకు మాత్రం ఇది తప్పని సరి. 2018లో 51 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకోగా 36 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు క్లియర్ అయ్యారు. ఇక రిజర్వేషన్లను పక్కనబెడితే ఐఐటీ సీట్ల కేటాయింపుల్లో 15శాతం ఎస్సీలకు, 7.5శాతం ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. ఇక దివ్యాంగులకు 5శాతం రిజర్వేన్లు కల్పిస్తున్నారు.