యూపీఎస్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఈ సారి అదనంగా భర్తీ చేయనున్న పోస్టులు ఎన్నో తెలుసా..?
ఢిల్లీ: ఈ సారి అంటే 2019 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. క్రితం సారి కంటే 100 పోస్టులు అదనంగా ఇచ్చింది యూపీఎస్సీ బోర్డు. 2014 తర్వాత మళ్లీ 1291 పోస్టులకు మించి అదనంగా మరో 100 ఖాళీలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. యూపీఎస్సీ ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసులకు అభ్యర్థులు ఎంపిక అవుతారు.
2019 యూపీఎస్సీ పరీక్ష ద్వారా బోర్డు 896 ఐఏఎస్లను ఎంపిక చేయనుంది. ఇక ఐఏఎస్ అభ్యర్థుల ఎంపిక గత కొన్నేళ్లుగా సగటున 180గా ఉంది. ఇక ఈ సారి నోటిఫికేషన్లో మోడీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన అగ్రకులాల పేదలకు 10శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా బోర్డు చేర్చింది. ఎస్సీ, ఎస్టీ ఇతర వెనకబడిన వర్గాలు, ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారు, దివ్యాంగులకు ప్రభుత్వం పొందుపర్చిన నిబంధనల మేరకే జరుగుతుందని నోటిఫికేషన్లో యూపీఎస్సీ బోర్డు పేర్కొంది.
అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారిగా గుర్తింపు పొందాలంటే ఆ కుటుంబం ఏడాది ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. అంతేకాదు ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉంటే వారు కూడా రిజర్వేషన్ కిందకు వస్తారు. 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉన్న ఇళ్లు కలిగి ఉండాలి. మున్సిపాలిటీల్లో నివసించేవారికి 100 గజాలకంటే భూమి ఎక్కువగా ఉండరాదు.. అదే మున్సిపాలిటీ రహిత ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి 200 గజాలకంటే ఎక్కువగా స్థలం ఉండరాదనే నిబంధనలు చట్టంలో పొందుపర్చింది కేంద్రం.
ఇక తాము అగ్రకులాల పేదలుగా అని రుజువు చేసుకునేందుకు రిజర్వేషన్ వినియోగించుకునేందుకు ఆన్లైన్ దరఖాస్తుకు చేసుకునే సమయంలోనే ఇన్కం సర్టిఫికేట్ కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా 2019 ఆగష్టు 1 తర్వాతే తీసుకుని ఉండాలని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు మార్చి 18, 2019గా చివరి తేదీని పేర్కొంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్ష రాస్తున్నారు.