టాక్స్ పేయర్స్కు గుడ్ న్యూస్: ఇకపై 24 గంటల్లోనే మీ ఖాతాలోకి రిటర్న్స్
ఢిల్లీ: ఆదాయపు పన్ను కట్టేవారికి గుడ్ న్యూస్. మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన 24 గంటల్లోనే మీ ఖాతాలోకి మీకు రావాల్సిన మొత్తం పడిపోతుందని రెవిన్యూశాఖ అధికారి ఒకరు తెలిపారు. మరో రెండేళ్లలో ఈ తరహా విధానం అమల్లోకి వస్తుందని రెవిన్యూ అధికారులు తెలిపారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విభాగంలో ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 4,200 కోట్లు నిధులు విడుదల చేసింది.
ప్రస్తుతం ఆటోమేటిక్ పద్ధతిలో డబ్బులు టాక్స్ పేయర్ ఖాతాలో పడుతున్నాయని రెవిన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో రీఫండ్ రూపంలో రూ.1.50 లక్షల కోట్లు బ్యాంకు ఖాతాలోకి నేరుగా డిపాజిట్ అయ్యాయని చెప్పారు. అయితే సమయం కాస్త ఎక్కువ పడుతోందని చెప్పారు. ఈ వ్యవస్థనే అప్గ్రేడ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇది అప్డేట్ అయితే టాక్స్ పేయర్కు పడాల్సిన డబ్బులు కేవలం 24 గంటల సమయంలో పడుతుందని వెల్లడించారు. 2019-20కి ప్రవేశ పెట్టి మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆదాయపుశాఖ కిందకు వచ్చే అన్ని విభాగాలను ఆన్లైన్ చేయనున్నట్లు చెప్పారు.
గతేడాది 99.54 శాతం ఇన్కంటాక్స్ రిటర్న్స్ ను ప్రభుత్వం స్వీకరించిందని... రిటర్న్స్ రూపంలో ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యం అవుతున్నాయని చెప్పిన పీయూష్ గోయల్... ఇకపై ఐటీ శాఖలో కొత్త మార్పులు చేయనున్నామని చెప్పారు. ఐటీ శాఖను యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.ఇక పన్నుదారుడికి రావాల్సిన డబ్బులు తమ ఖాతాలో కేవలం 24 గంటల సమయంలో పడిపోతాయని వెల్లడించారు. రెండేళ్ల సమయంలో అన్ని చక్కబెడుతామని ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లు పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల పారదర్శకత కూడా ఉంటుందని చెప్పారు.