2018-19లో భారత ఆర్ధిక వృద్ది 7.3 శాతంగా నమోదయ్యే ఛాన్స్
న్యూఢిల్లీ: 2018-19లో భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతం నమోదవుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. నిర్మాణ, ఉత్పాదక, సేవా రంగాలు మెరుగైన సామర్థ్యం కనబరుస్తున్నాయని అంచనాలకు అనుగుణంగా వృద్ది రేటు ఉంటుందని తెలిపింది.
నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఎదురైన ప్రతికూల పరిణామాలు చాలావరకూ కనుమరుగయ్యాయని ఫిచ్ గ్రూప్ కంపెనీ బీఎంఐ రీసెర్చ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి 7.3 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలకు అనుగుణంగానే బీఎంఐ రీసెర్చి నివేదిక అంచనా వెలువడటం గమనార్హం. 2018-19లో వృద్ధి రేటు 7.4 శాతం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవల క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బీఎంఐ నివేదిక ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు భారత వృద్ది రేటు 7.5 శాతంగా ఉంటుందని ఇటీవల డచ్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక సైతం అంచనా వేసింది.