గుడ్ న్యూస్: పేదరికం ఉన్న దేశాల్లో ఇక భారత్ది అగ్రస్థానం కాదు
తమ ప్రజలు కఠిక పేదరికంలో జీవించడం ఏ దేశ ప్రభుత్వం ఆమోదించదు. అయితే కొన్ని దశాబ్దాలుగా కఠిక పేదరికంలో జీవిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటూ వచ్చింది. ఇందుకు కారణం ప్రతి ఏటా పెరుగుతున్న భారత జనాభా. అయితే తాజా గణాంకాల ప్రకారం భారత్ స్థానాన్ని నైజీరియా ఆక్రమించుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది. కఠిక పేదరికంలో నివసిస్తున్న దేశాల్లో ఇప్పుడు నైజీరియా టాప్ ప్లేస్లో నిలిచినట్లు బ్రుకింగ్స్ ఇన్స్టిట్యూషన్ నివేదిక విడుదల చేసింది.
నైజీరియాలో ప్రజలు రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువతో జీవిస్తున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు నేటికి కూడా అక్కడి ప్రజలు తిండి, గూడు, బట్ట కోసం పోరాడుతున్నట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
తాజాగా బ్రుకింగ్స్ నివేదిక ఇచ్చిన లెక్కల ప్రకారం భారత్లో 70.6 మిలియన్ల మంది కఠిక పేదరికంలో ఉండగా... నైజీరియాలో 87 మిలియన్ మంది పేదరికంలో మగ్గుతున్నారు.మరోవైపు పేదరికంలో ఉన్న వారి సంఖ్య భారత్లో తగ్గుతూ వస్తుండగా అదే నైజీరియాలో ఇందుకు భిన్నంగా పెరిగిపోతోంది.
అంతేకాదు నైజీరియాలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకంటే జనాభానే ఎక్కువగా పెరుగుతోందని రిపోర్ట్ వెల్లడించింది. నిమిషానికి ఆరుగురు పేదరికంలో జీవిస్తున్నారని పేర్కొంది. అదే భారత్లో నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయట పడుతున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని దశాబ్దాలుగా పేదరికంలో అగ్రస్థానంలో ఉన్న భారత్... బయటపడటం నిజంగానే శుభపరిణామం అని బ్రుకింగ్ ఇన్స్టిట్యూషన్కు చెందిన గ్లోబల్ ఎకానమి అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ హోమీ ఖరాస్ అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా దేశాల్లో పేదరికం పెరిగిపోతోందని చెప్పిన ఆయన ప్రపంచంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న దేశాల్లో మూడోవంతు దేశాలు ఒక్క ఆఫ్రికా ఖండంలోనే ఉన్నట్లు వివరించారు. ఇది ఇలానే కొనసాగితే 2030 కల్లా పేదరికం తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు దేశాలు అభివృద్ధి చెందుతుండగా ఆఫ్రికా మాత్రం పేదరికం వైపు అడుగులు వేస్తోంది.
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం,1990 నుంచి చాలా దేశాల్లో పేదరికం తగ్గుతూ వస్తోంది. ఎక్కవగా ఆసియా ఖండాల్లోనే పేదరికం తగ్గుతూ వస్తోందని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది . ఇందులో చైనా , ఇండోనేషియా, వియత్నాం, తాజాగా భారత్ దేశాలున్నట్లు పేర్కొంది. 2021 కల్లా భారత్లో 3శాతం కంటే తక్కువగా ప్రజలు పేదరికంలో ఉండే అవకాశముందని వరల్డ్ పవర్టీ క్లాక్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది పెద్ద చర్చకే దారి తీసే అవకాశముంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది అనాథలుగా, నిరాశ్రయులుగా మారుతున్నారు. అంతేకాదు కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భారత్లో 40శాతం పిల్లల్లో సరైన పోషకాహారాలు అందక వయస్సులో ఎదుగుదల కనిపించడం లేదు.