గుడ్ న్యూస్: త్వరలో రైల్వే ఛార్జీల ధరల తగ్గింపు..ఎంతో తెలుసా..?
నిత్యం రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది భారతీయ రైల్వేలు. కొన్ని రైళ్లలో టికెట్ ధరలను తగ్గించనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు వీటిలో ప్రయాణించేందుకు మొగ్గు చూపడం లేదని దీంతో ఈ రైళ్లను నడపడం వల్ల నష్టాలు వస్తున్నాయని రైల్వే శాఖ భావించింది. ఇక ఈ కొన్ని రైళ్లలో దాదాపు 25శాతం మేరా ఛార్జీలు తగ్గనున్నాయి.
శతాబ్ది, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లలో 50శాతం లేదా అంతకంటే తక్కువగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. దీంతో ఈ రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 30లోపే ఈ నిర్ణయం రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రైల్వే జోన్లకు టికెట్ ధరల తగ్గింపుపై సర్క్యులర్ పంపినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక నిత్యం నడిపే రైళ్లలో ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉన్న రైళ్లను గుర్తించి వాటి టికెట్ ధరలను 25శాతం మేరా తగ్గించాలంటూ ఆయా రైల్వే జోన్ అధికారులకు సర్క్యులర్ ద్వారా సూచించింది.
ఇక తగ్గించిన ఈ ఛార్జీలు ఎంతకాలం ఉంచాలన్నది ఆయా రైల్వే జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్ ఇష్టం మేరకు ఆధారపడి ఉంటాయని సర్క్యులర్లో స్పష్టం చేసింది. అది ఒక నెల ఉండొచ్చు, ఆరునెలలు ఉండొచ్చు లేదా కొన్నేళ్లు కొనసాగించొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఓ సాఫ్ట్వేర్ తయారు చేయాల్సిందిగా రైల్వే ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ధరలను నిర్ణయించే సమయంలో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని డిసైడ్ చేయాలని కోరింది రైల్వే శాఖ. ఈ స్కీమ్ను అమలు చేసే సమయంలో ఇతర డిస్కౌంట్లు వర్తించవని పేర్కొంది. అంతేకాదు ఇక ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రివ్యూ రిపోర్టు సమర్పించాలని కోరారు.