ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: ఇక ఆధార్ సంఖ్య కోసం వేచిచూడాల్సిన పనిలేదు
ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు లేదు. ఇకపై వారికి కూడా ఆధార్ కార్డు ఇస్తామని మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఇక ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు ఇచ్చే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అంతకుముందు ఎన్ఆర్ఐ ఆధార్ కార్డు పొందాలంటే దాదాపు 180 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు భారత్కు రాగానే తన ఆధార్ కార్డు పొందేలా వ్యవస్థను తీసుకొస్తోంది కేంద్రం.
ఎన్ఆర్ఐలకు ఆధార్ జారీ చేసే విషయమై సెప్టెంబర్ 20న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎన్ఆర్ఐ భారత్కు చేరుకోగానే ఆధార్ పొందేందుకు అర్హుడని పేర్కొంది. ఇక సెప్టెంబర్ 20న అంటే గెజిట్ నోట్ విడుదల అయినప్పటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని అందులో స్పష్టంగా పేర్కొంది కేంద్రం. ఇక నోటిఫికేషన్ ప్రకారం "నాన్ రెసిడెంట్ ఇండియన్" అంటే అర్థం ఏమిటో సవివరంగా పొందుపర్చింది. భారత పౌరసత్వం కలిగిన ఒక వ్యక్తి భారత పాస్పోర్టు కలిగి ఉండి ఇండియాలో కాకుండా విదేశాల్లో నివసిస్తున్నట్లయితే అట్టివారిని ఎన్ఆర్ఐలుగా పరిగణిస్తామని గెజిట్లో పొందుపర్చింది.
భారత్కు చేరుకోగానే వారికి ఆధార్ అందజేయడంతో ఈ దేశంలో వారు ఈ కార్డును చూపించి ఆర్థికలావాదేవీలు చేయొచ్చని కేంద్రం తెలిపింది. అంతేకాదు ఈ ఆధార్ కార్డు సంఖ్యతో వారు ఆదాయపు పన్నును చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ నోటిఫికేషన్ విడుదల కాకముందు ఒక ఎన్ఆర్ఐ ఆధార్ సంఖ్య పొందాలంటే, తను ఉంటున్న నివాసంకు సంబంధించిన సమాచారం, బయోమెట్రిక్ సమాచారంలాంటి పలు ప్రక్రియలు ద్వారా జరిగేది. ఇక ఆధార్ కార్డు వచ్చేందుకు 180 రోజుల సమయం పట్టేది.
త్వరలోనే ఎన్ఆర్ఐల కోసం యూఐడీఏఐ వ్యవస్థలో సాంకేతిక మార్పులు చేయనున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డు కోసం తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా మార్పులు తీసుకొస్తున్నామని చెప్పిన అజయ్ పాండే... వీరికి ఒక టైమ్ స్లాట్ కేటాయిస్తామని చెప్పారు. తద్వారా వారు భారత్కు రాగానే వీలైనంత త్వరగా వీరికి ఆధార్ సంఖ్య అందేలా చూస్తామని చెప్పారు.