పాక్ ఆధీనంలో ధైర్యంగా మాట్లాడాడు: అభినందన్ తండ్రి, ముఫ్తీ-మమత స్పందన
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ తండ్రి వర్ధమాన్ మీడియాతో మాట్లాడారు. తాను తన కొడుకును చూసి తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. అభినందన్ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రకటన చేయకముందు మాట్లాడారు. తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేశప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.
పాక్ ఆధీనంలోను ధైర్యంగా మాట్లాడారు
అభినందన్కు ఎలాంటి ప్రాణహానీ ఉండబోదని, ఆయనకు గాయాలు కాలేదని అనుకుంటున్నానని చెప్పారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ తన కొడుకు చాలా ధైర్యంగా మాట్లాడారని, అతను నిజమైన జవాను అని, అతనిని చూసి గర్విస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమ కుటుంబానికి అందరూ అండగా నిలబడ్డారని చెప్పారు.
అందరం ఎదురు చూస్తున్నాం
ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్... దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో పాకిస్థాన్ దిగివచ్చిన విషయం తెలిసిందే. అభినందన్ను భారత్కు అప్పగిస్తామని చెప్పింది. అభినందన్ను శుక్రవారం విడుదల చేయనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పైలెట్ అభినందన్ కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలందరం, ఆయన క్షేమంగా తిరిగి రావాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి భారతీయుడికి శుభవార్త
పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ విడుదల అందరికీ శుభవార్త అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. అభినందన్ను సురక్షితంగా వెనక్కి పంపుతుండటం ఆయన కుటుంబానికి, ప్రతి భారతీయుడికి శుభవార్త అన్నారు. అభినందన్ను చూసి అందరం గర్విస్తున్నామని చెప్పారు. దేశ రక్షణలో భారత భద్రతాదళాల స్థైర్యాన్ని చూసి గర్విస్తున్నామన్నారు. శాంతి నెలకొనడం మనకు చాలా ప్రధానమని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ మాట నిలబెట్టుకోవాలి
అభినందన్ విడుదల దేశానికి శుభవార్త అని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ అన్నారు. మన దేశం నాయకత్వం కూడా శాంతిపై దృష్టి సారించాలని చెప్పారు. పుల్వామా దాడిపై ఇమ్రాన్ ఖాన్ తన మాట మీద నిలబడి, ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటారమని భావిస్తున్నామని చెప్పారు.