మంచి రోడ్లే... ప్రమాదాలకు కారణం...! కర్ణాటక డిప్యూటి సీఎం
ప్రమాదాలకు కారణం అధ్వాన్నమైన రోడ్లు, ఇది అందరు చెప్పే మాట. రోడ్లు సరిగా లేకపోవడంతొ ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ వాదనను కొట్టి పారేశారు కర్ణాటక డిప్యూటి సిఎం గోవింద్ కర్జోల్ .రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడానికి మంచి రోడ్లని చెప్పారు. మంచి రోడ్లు ఉండడంతో వాహనదారులు అత్యధిక వేగంగా వెళుతున్నారని ఆయన చెప్పారు.
కొత్త వాహన మోటారు వాహన చట్టంపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతుండడంతో బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర చట్టంలో ఉన్న జరిమానలపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం జరిమానాలను సగానికి తగ్గించింది. దీంతో గుజరాత్ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోబీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడ మోటారు వాహన చట్టం సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయించారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే ఈ సంధర్భంలోనే మాట్లాడిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ మాత్రం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు విభిన్నంగా స్పందించారు. అధిక జరిమానాల కంటే ప్రమాదాలు నివారించేందుకు సరైన రోడ్లు నిర్మించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తుందంటూ విలేకర్లు అడిగారు. దీంతో ప్రమాదాలకు ప్రధాన కారణం మంచి రోడ్ల నిర్మాణమే అని పేర్కోన్నారు. సంవత్సరంలో పదివేల మంది రోడ్లు సరిగా లేని కారణంగా మృత్యువాత పడ్డారని, మీడియా కథనాలు రాసిందని కాని అది కరెక్ట్ కాదని చెప్పారు. మంచి రోడ్లవల్లే ప్రమాదాలు ఎక్కువవవుతున్నాయని చెప్పారు.