ఊహించని దెబ్బ, 6జిల్లాల్లో తెరవని ఖాతా: మోడీ దూకుడుకు 'గుజరాత్' కళ్లెం, ఆ వైపు మోడీ చూపు!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విధంగా బీజేపీకి చేదును మిగిల్చాయి. కారణాలు ఏవైనా గతంలో కంటే సీట్లు తగ్గడం ఆ పార్టీ జీర్ణించుకోలేని విషయం. కుల సంఘ నాయకులు కలవడం వంటి కారణాల వల్ల బీజేపీ గతంలో కంటే తక్కువ సీట్లతో గట్టెక్కింది.
Recommended Video
పలు జిల్లాల్లో ఆయా నేతల ప్రభావం పడినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ గెలుపును వారు అడ్డుకోలేకపోయినప్పటికీ ఓట్ల శాతాన్ని, సీట్లను మాత్రం తగ్గించగలిగారు. పాటీదార్, ఓబీసీ, దళిత నేతలు హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు బీజేపీని దెబ్బతీశారు.
బీజేపీతో ఢీ, మోడీకి గుజరాత్ చేదు: రాహుల్ గాంధీ వెనుక నటి రమ్య
పలు జిల్లాల్లో ఖాతా తెరవని బీజేపీ, కాంగ్రెస్
పదకొండున్నర గంటల సమయానికి బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఏడు జిల్లాల్లో పోటాపోటీ కనిపించింది. ఆరు జిల్లాల్లో కమలం పార్టీ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ రెండు జిల్లాల్లో ఖాతా తెరవలేదు. పలు జిల్లాల్లో ఖాతా తెరవకపోవడం బీజేపీకి ఊహించని దెబ్బే.
ఏడు జిల్లాల్లో పోటాపోటీ
బీజేపీ - కాంగ్రెస్ మధ్య ఏడు జిల్లాల్లో పోటీ పోటీ కనిపించింది. సబర్కంత, ద్వారకా, ఖేడా, మహీసాగర్, బనస్కంత, కచ్, బోతాద్ జిల్లాల్లో ఢీ అంటే ఢీ అన్నట్లుగా కనిపించింది. అమ్రేలీ, నర్మదా, పోరుబందర్, ఆనంద్, డాంగ్స్, తాపి.. ఈ ఆరు జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ నవ్సారీ, ఆర్వలీ జిల్లాల్లో ఖాతా తెరవలేదు.
150 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ
గుజరాత్లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తామని భావించింది. ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా 150 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ వందకు పైగా సీట్లతో ఆగిపోయారు. అలాగే ఓట్ల శాతం కూడా తగ్గింది. పటీదార్, ఓబీసీ, దళిత్ ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడం కూడా ముఖ్య కారణం.
మోడీ దూకుడుకు గుజరాత్ కళ్లెం
అయినప్పటికీ ఓట్లు, సీట్లు తగ్గడంపై బీజేపీ పునరాలోచన చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భావి భారత్ కోసం మోడీ ఈ మూడేళ్లలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విపక్షాలు అరిచినా, గీపెట్టిన భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే సంస్కరణలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి బలమైన నిర్ణయాలు తీసుకున్నారు.
2019 ఎన్నికలు, సంస్కరణలు పక్కన పెట్టేనా
ప్రధాని నరేంద్ర మోడీ సంస్కరణల ఫలితంగా భారత్ భవిష్యత్తు బాగుంటుందని బీజేపీ చెప్పుకొచ్చింది. విపక్షాలు ఏం మాట్లాడినా పట్టించుకోలేదు. ప్రజల ఆగ్రహాన్ని కూడా చవి చూశారు. అయితే ఇదంతా భావి భారత్ కోసమని చెప్పారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మోడీ, బీజేపీ సంస్కరణల విషయంలో పునరాలోచన చేయవచ్చునని అంటున్నారు.
మోడీ కూడా ఊహించి ఉండరు
గుజరాత్లో కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం, పటీదార్ల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోడీ గుజరాత్లో విస్తృతంగా పర్యటించారు. రాహుల్ గాంధీకి ధీటుగా ప్రచారం చేశారు. 120కి పైగా సీట్లు వస్తాయని బీజేపీ భావించింది. కానీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి, తమ ఓట్లను, సీట్లను తగ్గిస్తుందని మోడీ కూడా ఊహించి ఉండరని అంటున్నారు. సొంత రాష్ట్రంలో అమిత్ షా టార్గెట్ 150 కోసమే మోడీ పని చేశారని, ఎంత కాదన్నా 120కి పైగా సీట్లు వస్తాయని భావించారని, కానీ అందుకు కొన్ని సీట్లు తక్కువగానే వచ్చాయి. దీంతో మోడీ ప్రస్తుతానికి తన సంస్కరణలను పక్కన పెట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇక జనాకర్షకం వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.