శతాబ్ది ఎక్స్ప్రెస్కు గుడ్ బై.. ట్రైన్ 18కు వెల్కమ్: కొత్త రైలు విశేషాలు చూడండి
ఢిల్లీ: భారతీయ రైల్వేలో దశాబ్దాల పాటు సేవలందించిన అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇక విశ్రాంతి తీసుకోనుంది. కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తక్కువ సమయంలోనే వారి గమ్యస్థానాలకు చేర్చిన ఈ రైలు ఇక కనుమరుగు కానుంది. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు స్థానంలో కొత్తగా ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18 త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇందుకోసం డిసెంబర్ 29న ముహూర్తం ఖరారు అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసి నుంచి పచ్చజెండా ఊపి ఈరైలును ప్రారంభిస్తారు.
1988 నుంచి సేవలందించిన శతాబ్ది ఎక్స్ప్రెస్
దేశంలోనే తొలిసారిగా ఇంజిన్ రహిత రైలు ఢిల్లీ వారణాసిల మధ్య పరుగులు పెట్టనుంది. 1988లో శతాబ్ది రైలు తొలిసారిగా పట్టాలపైన కూత పెట్టింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. ప్రస్తుతం శతాబ్ది ఎక్స్ప్రెస్ దేశంలోనే ప్రధాన నగరాలకు కనెక్ట్ అవుతూ 20 రూట్లలో ప్రయాణిస్తుంది. ఇందులో మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రముఖ నగరాలు కూడా ఉన్నాయి.
ప్రపంచ స్థాయి వసతులతో వస్తోన్న ట్రైన్ 18
ట్రైన్ 18ను చెన్నైలోని ఐసీఎఫ్ తయారు చేసింది. దీనికైన వ్యయం రూ. 100 కోట్లు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తి అయ్యింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ ఇంజిన్ రహిత రైలు పరుగులు తీయనుంది. నీలం రంగులో ఉండే ఈ రైలులో ప్రపంచ స్థాయిలో అత్యాధునిక వసతులు కల్పించారు. రైలులో వైఫైతో పాటు జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, టచ్ ఫ్రీ బయో వ్యాక్యూమ్ టాయ్లెట్స్, ఎల్ఈడీ లైటింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వాతావరణ నియంత్రణ వ్యవస్థలను అమర్చారు. బయటి వాతావరణం అనుగుణంగా రైలులో వాతావరణం మారుతుంది. రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో ఎగ్జిక్యూటివ్ కంపార్ట్మెంట్లో 52 సీట్లు ఉన్నాయి. ఇక ఇతర కోచ్లలో 78 సీట్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్లలో రొటేటింగ్ సీటింగ్ సదుపాయం ఉంది. అంటే రైలు ఏదిశలో అయితే ప్రయాణిస్తుందో ఆ దిశకు సీట్లు కూడా అడ్జెస్ట్ అవుతాయి.
ఢిల్లీ నుంచి వారణాసికి పరుగులు పెట్టనున్న ట్రైన్ 18
ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం న్యూఢిల్లీలో ఉదయం 6 గంటలకు ఈ ట్రైన్ 18 బయలుదేరుతుంది. వారణాసికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. తిరిగి వారణాసిలో 2:30 గంటలకు బయలుదేరి ఢిల్లీకి రాత్రి 10:30కు చేరుకుంటుంది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంపై రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మరో నాలుగు రైళ్లను తయారు చేయాల్సిందిగా చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి సూచించారు.