గూగుల్ కన్నా ‘గురువే’ మిన్న: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తిరువనంతపురం: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, గురువు స్థానాన్ని ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఎన్నటికీ భర్తీ చేయలేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో శుక్రవారం జరిగిన శ్రీ చితిర తిరునాల్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
''నేడు, ప్రపంచం శరవేగంగా దూసుకుపోతోంది. మీకు గూగుల్ అందుబాటులో ఉన్నా సరే మీకో గురువు అవసరం. గురువును గూగుల్ భర్తీ చేయలేదు.'' అని ఆయన వ్యాఖ్యానించారు. నేటి ఆధునిక శకంలోనూ ప్రతి ఒక్కరూ మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరారు.
తల్లి, మాతృభూమి, మాతృభాష, గురువులను ఎప్పటికీ మర్చిపోరాదని ఆయన సూచించారు. ఆంగ్ల భాషకు తాను వ్యతిరేకంకాదని, కానీ, ప్రతి ఒక్కరూ తమ మాతృభాషకు ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇళ్లలో తల్లులు తమ పిల్లలకు నేర్పాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఏ హోదాలో ఉన్నా తాను సూటు, కోటు ధరించడం కన్నా పంచె కట్టు అంటేనే తనకు ఇష్టమని వెంకయ్యనాయుడు చెప్పారు. వస్తధారణతో వ్యక్తులకు గుర్తింపు రాదని, చేసే పనులను బట్టి వస్తుందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఉపరాష్ట్రపతి సాధారణ వస్తధారణ గురించి ప్రస్తావించగా.. ఈ మేరకు స్పందించారు.
ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత కొందరు తనతో మాట్లాడుతూ 'రాజ్యాంగ పదవిలో ఉంటూ కోటు(బంద్గాలా) ధరించక పోతే ఎలా?'అంటూ ప్రశ్నించారని చెప్పారు. అయితే తాను 'మారింది దుస్తులు కాదు...చిరునామా మాత్రమే'అని జవాబిచ్చానని వెల్లడించారు. ఎంత పెద్ద పదవులను చేపట్టినా సరే సంప్రదాయాలను గౌరవించాలని, మన ఆచార వ్యవహారాల పట్ల స్వాభిమానంతో ఉండాలని ఆయన సూచించారు.