గూగుల్, ఫేస్బుక్ సంచలన నిర్ణయం: 'ఫేక్ న్యూస్' ప్రచారం చేస్తే అంతే!
వాషింగ్టన్ : వెబ్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో.. సంచలనాల కోసం అవాస్తవాలను ప్రచారం చేయడం.. నెటిజెన్స్ ను ఆకట్టుకోవడానికి లేని వార్తలకు ప్రాధాన్యం కల్పించడం వంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా.. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరగడంతో గూగుల్, ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇకనుంచి ప్రజల నుంచి తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించే వెబ్ సైట్లకు ప్రకటనల కోత పెట్టనుంది గూగుల్. ప్రాధాన్యం లేని, అవాస్త అంశాలను సంచలనంగా ప్రచారం చేసే సైట్లకు ఇకనుంచి గూగుల్ యాడ్స్ ఉండబోవు.
బీబీసీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్. వెబ్ మీడియాలో ప్రతీరోజు వందల అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రెండు సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. కాబట్టి ఇకనుంచి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తామని పిచాయ్ తెలిపారు. దీనిపై చర్చ సాగించే ఉద్దేశ్యం తమకు లేదని, అత్యంత విశ్వసనీయత వార్తలను ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొన్నారు.
నిజ నిర్దారణ కోసం గూగుల్ కు సంబంధించి ఆల్గారిథమ్స్ లో ఖచ్చితమైన మార్పులు చేస్తున్నట్టుగా పిచాయ్ చెప్పారు.