400 రైల్వే స్టేషన్లలో ఉచిత గూగుల్ వైఫై
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రైల్టెల్ సహకారంతో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించింది.
అసోంలోని దిబ్రుగఢ్ రైల్వేస్టేషన్లో గురువారం ఉచిత వైఫై ఏర్పాటుచేశారు. దీంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని గూగుల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
డిజిటల్ ఇండియాలో భాగంగా 2016 జనవరిలో ఈ ఉచితవైఫై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైల్వేశాఖకు చెందిన టెలికాం విభాగం రైల్టెల్ సహాకారంతో గూగుల్ రైల్వేస్టేషన్లలో వైఫై రూటర్లను ఏర్పాటుచేస్తోంది. తొలిసారిగా ముంబై సెంట్రల్ స్టేషన్లో ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రాజెక్టును చేపట్టిన తొలి ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 పెద్ద రైల్వేస్టేషన్లలో వైఫైను ఏర్పాటుచేశారు. నేటితో ఆ సంఖ్య 400కు చేరింది. ఈ వైఫైతో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.