హర్యానా.. చేజారినట్టేనా? అమిత్ షా మార్క్ పాలిటిక్స్: బీజేపీకి ఆరుగురు స్వతంత్రుల మద్దతు
చండీగఢ్: హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానా.. రసవత్తర రాజకీయాలకు కేంద్రబిందువైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలినన్ని సీట్లు ఏ పార్టీకి కూడా లభించకపోవడంతో.. ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. 40 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతాపార్టీ ఇండిపెండెంట్లపై కన్నేసింది. విజయం సాధించిన ఏడుమంది స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు సాగిస్తోంది. క్యాంపు రాజకీయాలకు తెర తీసింది. వివాదాస్పద స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్ కందా సహా మరో అయిదుమంది తమకు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ చెప్పుకుంటోంది.
మహారాష్ట్రలో ఒక్కటే: మాలెగావ్ లో మజ్లిస్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో..!
ఆరు సీట్ల దూరంలో ఆగిన కమలం..
90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 46. బీజేపీ అయిదు సీట్ల దూరంలో ఆగిపోయింది. 40 నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 31 స్థానాలతో కాంగ్రెస్.. 12 సీట్లతో జన్ నాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ), హర్యానా లోక్ హిత పార్టీ చెరో స్థానాలో గెలిచాయి. అయిదుమంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఈ అయిదుమంది కూడా తమకు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.
ఆ అయిదుమందీ వీరే..
రణ్ ధీర్ సింగ్ గొల్లెన్ (ఫుండ్రి), బల్రాజ్ కుండు (మెహమ్), రంజిత్ సింగ్ (రనియా), రాకేశ్ దౌల్తాబాద్ (బాద్షాపూర్), గోపాల్ కందా (సిర్సా). ఈ అయిదుమంది బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్ కు మద్దతు లేఖను సైతం అందించారు. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి ఇక ఒక్క ఎమ్మెల్యే మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్.. దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. అయిదుమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలన కలుసుకున్నారు. బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ లో ఆందోళన..
స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలకడం కాంగ్రెస్ లో ఆందోళనకు దారి తీసింది. తాను సొంతంగా సాధించిన 31 స్థానాలతో పాటు జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ)-10, ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేలు సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఒకవంక మంతనాలు సాగిస్తోన్న సమయంలోనే స్వతంత్ర ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బీజేపీ వైపు వారు మొగ్గు చూపడం, బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు లిఖితపూరకంగా తెలియజేయడం చకచకా సాగిపోయాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ ను కలుసుకోవాలని నిర్ణయించాయి. సోమ్ వీర్ సంగ్వాన్, ధరమ్ పాల్ గోండెర్ సైతం బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటులో ఖట్టర్..
స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనోహర్ లాల్ ఖట్టర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హర్యానా గవర్నర్ ను కలుసుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన గవర్నర్ కు అందజేయనున్నారు. 46 మంది సభ్యుల బలం తమకు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరనున్నారు. ఈలోగా కాంగ్రెస్ సైతం గవర్నర్ ను కలిసే అవకాశాలు లేకపోలేదు. స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లడం.. కాంగ్రెస్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. వారిలో కనీసం ముగ్గురినైనా తమవైపు మొగ్గు చూపేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది.