హర్యానా క్యాబినెట్లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...
హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్పుదామని అనుకొన్న.. బీజేపీ వేగంగా స్పందించడంతో కాంగ్రెస్-జేజేపీ ప్రభుత్వం అనే అంశం కలగానే మారిపోయింది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన క్యాబినెట్ బెర్త్పై సందేహాలు నెలకొన్నాయి.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాల్సి ఉండగా.. బీజేపీ 40 వద్దే ఆగిపోయింది. దీంతో ఇండిపెండెంట్ల మద్దతు తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో హర్యానా లోఖిత్ పార్టీ చీఫ్ గోపాల్ కందా రంగంలోకి దిగారు. 8 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకొన్నారు. వీరిని బీజేపీ ఎంపీ సునీత దగ్గల్ తీసుకెళ్లారు. బేషరతుగా మద్దతిస్తామని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం క్యాబినెట్ బెర్తులు అడుగగా.. బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపిందని.. కానీ ఆయన గత చరిత్ర నేపథ్యంలో మంత్రి పదవీ దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజిత్ సింగ్తో గోపాల్ కందా గొడవపడినట్టు ఉన్న వీడియో ఒకటి గురువారం వైరల్ అయ్యింది. బీజేపీకి మద్దతిచ్చి రంజిత్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని కోరినట్టు గోపాల్ తెలిపారు. దీంతోపాటు 2012లో భూపిందర్ హూడా ప్రభుత్వంలో కూడా గోపాల్ మంత్రిగా పనిచేశారు. అయితే ఎయిర్ హోస్టెస్పై లైంగికదాడికి సంబంధించి అభియోగం వెలుగులోకి రావడంతో క్యాబినెట్ బెర్త్ ఊడిపోయింది. గత చరిత్ర నేపథ్యంలో బీజేపీ కూడా మంత్రి పదవీ ఆఫర్ చేస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.