ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం: నాడు బీజేపీ ధర్నా..నేడు మద్దతు కోసం! సూపర్ పవర్ గా చెప్పులషాపు ఓనర్
చండీగఢ్: గోపాల్ కందా. గోపాల్ గోయల్ కందా. హర్యానా మాజీమంత్రి. ఆ రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకొంటున్న ఓ స్వతంత్ర ఎమ్మెల్యే. రాత్రికి రాత్రి సూపర్ పవర్ గా ఎదిగిన ఓ సాధారణ చెప్పుల దుకాణం ఓనర్. బీజేపీ వంటి కొమ్ములు తిరిగిన పార్టీ సైతం తన మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం అనే పరిస్థితిని తీసుకొచ్చిన ఓ రియల్టర్. భారతీయ జనతాపార్టీకి మద్దతు ప్రకటించిన తరువాత.. ఈ గోపాల్ కందా పేరు మారు మోగిపోతోంది ఒక్క హర్యానాలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా. దీనికి ప్రధాన కారణం- ఆయన నేపథ్యం. అక్రమాలు, అనేక నేరాలతో ముడిపడి ఉన్న గోపాల్ కందా మద్దతు తీసుకోవడాన్ని బీజేపీ సీనియర్ ఉమా భారతి సహించలేకపోతున్నారు.
మోడీ-షాపై ఉమా భారతి నిప్పులు: తల్లి కుమార్తె ఆత్మహత్యకు కారణం..బెయిల్ పై ఉన్న ఎమ్మెల్యేతో మద్దతా?
చెప్పుల షాపు నుంచి సొంతంగా విమానాలను కొనుగోలు చేసేలా..
హర్యానాలోని సిర్సాకు చెందిన గోపాల్ కందా ఇదివరకు ఓ చెప్పుల దుకాణాన్ని నడిపే వాడు. అనంతరం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ప్రకటించిన తరువాత.. క్రమంగా రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేశాడు. భూముల క్రయ, విక్రయాల్లో కోట్ల రూపాయలను గడించాడు. సొంతంగా తేలిక పాటి విమానాలను కొనుగోలు చేసేంత స్థాయికి ఎదిగాడు. ఆయన తండ్రి మురళీధర్, కుమారుడు లఖ్ పత్ రాయ్ పేర్లు కలిసి వచ్చేలా ఎండీఎల్ఆర్ ఎయిర్ లైన్స్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఆయన రాకపోకలన్నీ ఆ విమానాల్లోనే. అయిదుమంది స్వతంత్రులను తీసుకుని తన సొంత విమానంలోనే ఆయన ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్లారు.
ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం..
గీతికా శర్మ అనే ఓ ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం చేశారనే ఆరోపణలు గోపాల్ కందాపై ఉన్నాయి. తనకు న్యాయం జరగకపోవడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన గీతికా శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. 2012లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుమార్తెకు న్యాయం జరక్కపోవడంతో ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో హర్యానాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గోపాల్ కందా మంత్రి. గీతికా శర్మ ఘటన హర్యానాలో తీవ్ర ప్రకంపనలను పుట్టించింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై ఛార్జిషీట్ నమోదు చేశారు. జైలుకు పంపించారు. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.
నాడు ధర్నా చేసిన బీజేపీ..నేడు అతని మద్దతు కోసం
విచిత్రమేమిటంటే- గోపాల్ కందాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో స్వయంగా ఇదే బీజేపీ.. పెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపించింది. హర్యానా వ్యాప్తంగా ఆందోళను నిర్వహించింది. గీతికా శర్మకు న్యాయం చేయాలంటూ బంద్ చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బీజేపీ.. ఇప్పుడు అతని మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనితో గోపాల్ గోయల్ కందా పేరు మరోమారు దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. గోపాల్ కందా మద్దతును తీసుకోవడాన్ని ఉమా భారతి సైతం తప్పుపట్టారు. ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి ఆమె వరుసగా ట్వీట్లను సంధించారు.
2014లో సొంతంగా పార్టీ పెట్టి..
జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తరువాత గోపాల్ కందాకు ఎవరూ రాజకీయ పరంగా ఆశ్రయాన్ని ఇవ్వలేకపోయారు. దీనితో ఆయనే సొంతంగా హర్యానా లోక్ హిత పేరుతో పార్టీ పెట్టారు. 2014లో హర్యానా ఎన్నికల్లో విస్తృతంగా పోటీ చేశారు. ఫలితాలన్నీ ఆయనకు వ్యతిరేకంగానే వెలువడ్డాయి. నాటి ఎన్నికల్లో సిర్సా నుంచి పోటీ చేసి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అభ్యర్థి చేతిలో మట్టి కరిచారు. మొన్నటి ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిగా సిర్సా నుంచే పోటీ చేశారు. విజయం సాధించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపికి మద్దతు ఇచ్చారు.