నా పాప చనిపోయినా వైద్యం చేశారు: గోరఖ్పూర్ ఆస్పత్రి ఘటనపై ఓ తండ్రి ఆవేదన
లక్నో: గోరఖ్పూర్ ఆస్పత్రిలో 70మందికిపైగా చిన్నారులు మృతి చెందిన ఘటనలో మరో దారుణం వెలుగుచూసింది. చిన్నారుల ప్రాణాల పట్ల ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ ఘటనను పరిశీలిస్తే తెలుస్తోంది. తమ చిన్నారుల మరణాలకు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ వారి తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
యూపీలో 63కు చేరిన చిన్నారుల మరణాలు: యోగి సీరియస్, అసలేం జరిగింది?
బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఆగస్టు 10, 11.. రెండు రోజుల్లో దాదాపు 32 మంది చిన్నారులు మృత్యువాత పడగా.. ఆదివారం వరకు మొత్తం 79 మంది పసిపిల్లలు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ దారుణ ఘటనను తక్కువ చేసి చూపేందుకు అక్కడి యంత్రాంగం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే..
మరోవైపు ఆస్పత్రి సిబ్బంది చిన్నారుల ప్రాణాల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఖుషీ అనే చిన్నారి తండ్రి మహ్మద్ జహీర్ ఆరోపించారు.
Recommended Video
మృతిని ప్రకటించలేదు..
మహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. బీఆర్డీ ఆస్పత్రికి తన ఐదేళ్ల పాప ఖుషీని ఆగస్టు 10న తీసుకువచ్చారు. ఆక్సిజన్ అందక పాప చనిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం పాప చనిపోయినట్లు ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో.. వారు పాప మృతిని ప్రకటించకుండా ఆలస్యం చేశారు. పాపకు ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా నిలిపివేశారు.
మీడియా ఉండటం వల్లే..
అంబు పంప్ ఇచ్చి చేతితో నొక్కుతూ ఆక్సిజన్ అందేలా చూసుకోమని చెప్పివెళ్లారు. కాసేపటికే పాప చనిపోయినట్లు తమకు తెలుస్తోంది. ఆమె శరీరమంతా చల్లగా మారిపోయింది. అయితే వైద్యులు మాత్రం వెంటనే చిన్నారి మృతిని ధ్రువీకరించలేదు. బయట మీడియా సిబ్బంది ఉండటంతో చనిపోయిన తన పాపకు వైద్యం చేస్తున్నట్లు నటించారని మహ్మద్ తెలిపారు.
తల్లిదండ్రులకు కన్నీరే మిగిల్చిన ఆస్పత్రి
తన కూతురు 6 గంటలకు చనిపోతే.. అందరూ వెళ్లిపోయాక రాత్రి 10 గంటలకు చనిపోయినట్లు ప్రకటించారని ఖుషీ తండ్రి మహ్మద్ జహీర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురిని డాక్టర్ చేయాలని తనకు కల ఉండేదని.. జహీర్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇది ఇలా ఉండగా, మరో చిన్నారి తండ్రి ఆరోజు జరిగిన ఘటన గురించి వివరిస్తూ.. తన పాప ముక్కులోంచి రక్తం వస్తుందని వైద్యులకు చెబితే.. రక్తం కాదు అది ముక్కులోని మలినాలు బయటకు వస్తున్నాయని, కంగారు ఏమీ లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయి ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.