గోరక్పూర్ అల్లర్ల కేసు: యోగి పాత్రపై సిబిఐ విచారణ కావాలన్న పిటిషన్ కొట్టివేత
లక్నో: 2007లో జరిగిన గోరక్పూర్ అల్లర్ల కేసులో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అలహాబాద్ హైకోర్టులో గురువారం ఊరట లభించింది.
గోరక్పూర్ అల్లర్ల కేసులో యోగి ఆదిత్యనాథ్ పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని న్యాయస్థానం కొట్టివేసింది.
జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ ఎసీ శర్మల డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ కొట్టివేసింది. యోగిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత ఆయనకు ఇది మరో ఊరట.
యోగి ఆదిత్యనాథ్ అల్లర్ల కేసులో నిందతుడిగా ఉన్నారని, ఈ కేసు దర్యాఫ్తు చేస్తున్న సీఐడీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నందున, ఆ కేసును ప్రభావితం చేయవచ్చునని, కాబట్టి దీనిని సీబీఐకి అప్పగించాలని పర్వేజ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2007లో రెండు మతాల మధ్య జరిగిన గొడవలో ఓ హిందూ వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత యోగి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కేసు నమోదయింది. అలహాబాద్ కోర్టు కల్పించుకున్న తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.