గోరఖ్పూర్లో చిన్నారుల మృత్యుఘోషకు తెర పడేదెన్నడు?
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ బాబా రాఘవ్దాస్ (బీఆర్డీ) వైద్యకళాశాల దవాఖానలో చిన్నారుల మృత్యుఘోష ఆగడం లేదు. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ బాబా రాఘవ్దాస్ (బీఆర్డీ) వైద్యకళాశాల దవాఖానలో చిన్నారుల మృత్యుఘోష ఆగడం లేదు. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గత నాలుగు రోజుల్లో 70 మంది మరణిస్తే వారిలో అత్యధికులు నవజాత శిశువులే కావడం గమనార్హం.
వారిలో 15 మంది మెదడు వ్యాపుతో బాధ పడుతున్న వారే. మంగళ, బుధవారాల్లో 24 గంటల్లో 19 మంది మృత్యువాతపడ్డారు. వారిలో నలుగురు మెదడువాపుతో, మిగతా వారు నియోనెటల్ ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు. మూడు వారాల క్రితం ఆక్సిజన్ కొరతతోపాటు వివిధ కారణాలతో 70 మంది నవజాత శిశువులు మరణించడంతో ఈ దవాఖాన వార్తల్లో పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ ప్రకటించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంత జిల్లాలు, పొరుగున ఉన్న బీహార్తోపాటు నేపాల్ నుంచి భారీగా చిన్నారులు ఈ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నెలలు నిండకముందే జననం, తక్కువ బరువు, కామెర్లు, న్యూమోనియా, అంటువ్యాధులు, మెదడువాపు వ్యాధులతో పరిస్థితి మరింత విషమించిన తర్వాత తమ దవాఖానలో చేరుస్తారని బీఆర్డీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ తెలిపారు.
వసతుల్లో లోపం.. ఒకే బెడ్పై ఐదుగురు పిల్లలు
తల్లులకు పౌష్టికాహార లోపం వల్లే పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, ఇదే అనారోగ్య సమస్యలకు కారణమని, ఫలితంగా పుట్టిన గంటలోపే మరణిస్తున్నారని బీఆర్డీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేక ఐదుగురు బాలలను ఒకే బెడ్ పై ఉంచాల్సి వస్తున్నది. తమ వద్ద వనరులు తక్కువగా ఉన్నాయని, అందువల్ల ఒక్కో బెడ్ పై ముగ్గురు పిల్లలకు చికిత్స చేస్తున్నామన్నారు. తమకు మౌలిక వసతులు పుష్కలంగా ఉన్న భారీగా వచ్చి పడుతున్న రోగులతో అదనపు భారంగా పరిణమించిందన్నారు. ప్రతి రోజూ నాలుగు వేల మంది ఔట్ పేషంట్ విభాగంలో చికిత్స కోసం రావడంతో పనిభారం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
రోగులు, వైద్యుల నిష్పత్తిలో తేడా
మరోవైపు ఆసుపత్రిలో 950 బెడ్లు ఉంటే వాటిలో 90 శాతం బెడ్లపై రోగులు ఉంటారన్నారు. సమయానుకూలంగా దవాఖానలో మానవ వనరుల పెంపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం రోగులు వైద్యుల నిష్పత్తి 10:1కి 17:1గా ఉన్నదన్నారు. బీఆర్డీ ఆసుపత్రిలో భారీ స్థాయిలో నవజాత శిశువులు, పిల్లలు మరణించడానికి కారణం ఆక్సిజన్ కొరత కాదని కేంద్రం పంపిణీ వైద్య నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది.
నెలలు నిండక ముందే జననం, ఊపిరాడక
నెలలు నిండక ముందే జననం, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరికావడం, సెప్సిస్ వంటి కారణాలతో అత్యధికం పిల్లలు మరణిస్తున్నారని ఆ కమిటీ నివేదిక సారాంశం.ఈ నెల ప్రారంభంలో సంభవించిన మరణాలకు జపనీస్ మెదడువాపు వ్యాధి కారణం కాదని పేరు చెప్పడానికి నిరాకరించారు. కేంద్ర వైద్యుల కమిటీ నివేదిక ప్రకారం 49 శాతం మరణాలు నియో నాటల్, 16 శాతం చిన్నారులు ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని కేంద్ర వైద్యుల కమిటీ సమర్పించిన నివేదిక తెలపింది. 2016, 2017ల్లో ఇదే దవాఖానలో జరుగుతున్న మరణాలకు తేడా ఏమీ లేదని తేల్చేశారు. 2016 జూలైలో 292 మంది మరణిస్తే, ఈ ఏడాది 200 మంది మరణాలు జరిగాయని తెలిపారు.
గోరఖ్పూర్లో విషాదం మామూలే
ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు పోటెత్తడం వల్ల పరిస్థితి విషమించిందని మెదడువాపు వ్యాధి వార్డు డాక్టర్ ఒకరు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి సోమవారం వరకు నవజాత శిశువుల వార్డు, మెదడువాపు వార్డుల్లో కనీసం 1256 మంది బాలలు మరణించారని దవాఖాన వర్కింగ్ ప్రిన్సిపాల్ పీకే సింగ్ అన్నారు. ఈ నెలలో మొత్తం 296 మంది బాలలు మరణించారు. వారిలో 213 మంది నియో నాటల్ ఐసీయూ వార్డులో, మెదడువాపు వార్డులో 83 మంది చిన్నారులు ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో 71 మంది బాలల మృతి చెందిన కేసులో కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్మిశ్రా, ఆయన భార్య డాక్టర్ పూర్ణిమా శుక్లాలను కాన్పూర్కు చెందిన యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాజీవ్మిశ్రా దంపతులతోపాటు డాక్టర్ కఫీల్అహ్మద్, పుష్పా సేల్స్కు చెందిన ఉదయ్ప్రతాప్ శర్మ సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది.